కార్తీక శోభ

31 Oct, 2016 22:01 IST|Sakshi
కార్తీక శోభ
- సోమవారం పోటెత్తిన భక్తులు 
- శ్రీశైల ఆలయ పూజావేళల్లో మార్పులు 
- 1100పైగా సామూహిక  ఆర్జిత అభిషేకాలు 
·- నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
- క్యూలలో ఉచిత ప్రసాదవితరణ 
 
శ్రీశైలం: మొదటి కార్తీక సోమవారం  శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయం భక్తులతో పోటెత్తింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈఓ భరత్‌ గుప్త ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు. వేకువ జామున 3గంటలకు మంగళవాయిద్యాలు, 3.15గంటలకు సుప్రభాతం, 4గంటలకు మహామంగళహారతి, 4.30గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసంలోని శæని, ఆది, సోమవారాలు, పర్వదినాలు, ప్రభుత్వ సెలవు రోజులు..రద్దీ అధికంగా ఉండే ఆయా దినాలకనుగుణంగా పూజావేళలు ఈ విధంగా కొనసాగుతాయ తెలిపారు. కార్తీకమాసం ప్రారంభం రోజునే మొదటి సోమవారం కలిసి రావడంతో ఆదివారం సాయంత్రం నుంచి వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. అభిషేక సేవాకర్తల కోసం ఆన్‌లైన్‌ టికెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఒక రోజు ముందస్తు అభిషేకం టికెట్లు, కరెంట్‌ బుకింగ్‌లో తీసుకున్న టికెట్లను పెంపుదల చేయడంతో సుమారు 1100 పైగా అభిషేకం టికెట్లను విక్రయించినట్లు ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి తెలిపారు. సేవాకర్తలకు జాప్యం లేకుండా స్వామివార్ల కల్యాణ మండపంతో పాటు అక్కమహాదేవి అలంకార మండపంలో కూడా సామూహిక అభిషేకాలను నిర్వహించారు. స్వామి దర్శనంలో అభిషేక సేవాకర్తలకు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు.  
 
క్యూలైన్లలో అల్పాహారం ..
 కార్తీకమాసంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను  ఉచిత, ప్రత్యేక దర్శన క్యూల ద్వారా దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం పులిహోర ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మొదటి కార్తీక సోమవారం ఈ కార్యక్రమాన్ని ఈఓ ఉచిత దర్శన క్యూ వద్ద ప్రారంభం చేశారు. అలాగే ఆయా రద్దీ రోజుల్లో  అల్పాహారంతో పాటు పాలు, మజ్జిగ, మంచినీరు మొదలైనవి భక్తులకు క్యూలలో పంపిణీ అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు.  
 
 నాగులకట్ట వద్ద అన్ని ఏర్పాట్లు
కార్తీకమాసం సందర్భంగా భక్తులు కార్తీçకదీపాలను వెలిగించుకునేందుకు  ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ç అన్ని  ఏర్పాట్లు చేసినట్లు ఈఓ భరత్‌ గుప్త సోమవారం తెలిపారు. భక్తులు వేకువజాము నుంచే సంప్రదాయబద్ధంగా కార్తీక దీపారాధనలను చేసుకుంటారని,  అలాగే లక్షదీపాలను వెలిగించి శాస్త్రోక్త పూజలను, కార్తీక వ్రతం నోచుకుంటారని అన్నారు. ఆలయ ఉత్తర భాగం( శివాజీగోపురం)నుంచి  దీపారాధన భక్తులకు ప్రత్యేక ప్రవేశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. 
 
మరిన్ని వార్తలు