మోసం చంద్రబాబు నైజం

3 Jun, 2017 21:11 IST|Sakshi
మోసం చంద్రబాబు నైజం
- ఒక్క హామీని అమలు చేయని సీఎం
- అభివృద్ధి పేరుతో దోపిడీ
- శ్రీశైలం ఎమ్మెల్యే పార్టీ మారి ఓటర్లను వంచించాడు
- వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
    
ఆత్మకూరు: నమ్మిన వారిని మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నైజమని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఆత్మకూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శనివారం శ్రీశైలం నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి అధ్యక్షతన ప్లీనరీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ నాయకులు బీవై రామయ్య, కాటసాని రామిరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పేరుతో, వివిధ ప్రాజెక్టుల నిర్మాణమంటూ అక్రమ సంపాదనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల్లో వి«శ్వాసం కోల్పోయారని తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరి ఓటర్లను వంచించారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా శేషారెడ్డి తన తండ్రి స్వర్గీయ బుడ్డా వెంగళరెడ్డిలా ఇచ్చిన మాటకు కట్టుబడి, కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇందుకు బూత్‌ కమిటీ సభ్యులే కీలకమని సూచించారు.  
  
వైఎస్‌ఆర్‌సీపీతోనే సీమ సస్యశ్యామలం: గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ 
ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో చంద్రబాబు కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకుంటున్నారు. సీమలో కరువు పారదోలేందుకు సిద్దేశ్వరంతోనే సాధ్యం. ఇక్కడ అలుగు, వంతెన నిర్మాణానికి మహానేత వైఎస్‌ఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను విస్మరిస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి అధికారంతోనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. 
    
చంద్రబాబుకు శాపం ఉంది: బీవై రామయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఓ శాపం ఉంది. దీంతో ఆయన నిజం మాట్లాడరు. నిజం మాట్లాడితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుంది. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఆర్భాటంగా ప్రచారం చేయడం మినహా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. చంద్రబాబు పాలన అంటే కరువు కాటకాలు తథ్యమని ప్రజలకు తెలిసిపోయింది.  మహానేత పాలన తిరిగి రావాలంటే జననేత జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం.  
   
సమయం లేదు మిత్రమా.... రణానికి సిద్ధంకండి: కాటసాని రామిరెడ్డి, బనగానపల్లె ఇన్‌చార్జ్‌
మిత్రమా ఎన్నికలకు సమయం లేదు. మనం రణానికి సిద్ధంగా ఉండాలి. 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయ్యారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సీఎం తన కుమారుడు లోకేష్‌కు రాజకీయ ఉపాధి కల్పించారే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపాధి పనులు కల్పించలేదు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమికొడదాం. 
 
జగన్‌ వెంటే ప్రజలు:  ఐజయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ప్రజలు ఉన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ అరచాకాలు, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారు. నవ నిర్మాణదీక్ష పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారు.
 
అన్ని సీట్లు మావే: రాజగోపాల్‌రెడ్డి, నంద్యాల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి 
వచ్చే ఎన్నికల్లో జిల్లాల్లోని 14 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలవడం తథ్యం. ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అభివృద్ధి నిధులు పంచుకుంటున్నారు.      
 
మరిన్ని వార్తలు