యాదాద్రి పనుల పరిశీలన

2 Oct, 2016 23:32 IST|Sakshi
యాదాద్రి పనుల పరిశీలన
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కూల్చివేతలు, రాజగోపురాల నిర్మాణ పనులను వైటీడీఏ వైస్‌ చైర్మెన్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టులు ఆనంద్‌సాయి, బడే రవిలు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూల్చివేసిన  ప్రధానాలయాన్ని, నిర్మాణంలో ఉన్న రాజగోపురాలను పరిశీలించారు. అనంతరం వైటీడీఏ వైస్‌చైర్మెన్‌ కిషన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రార్‌ను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ దసరా రోజున రాజగోపురాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని సూచించారు. యాదాద్రి కోసం హైదరాబాద్‌లోని కోహెడ, గుంటూరు, గురిజాలపాలెం, మార్టూరులో శిల్పాలు తయారవుతున్నాయని తెలిపారు. దసరా రోజున ఉదయం 8.19 గంటలకు ఓ శిల్పాన్ని స్థాపించనున్నట్లు తెలిపారు. ప్రధానాలయంలో సుమారు 60 ఫీట్ల ఎత్తులో ధ్వజస్తంభం, 20 ఫీట్ల ఎత్తులో బలిపీఠం నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ గీతారెడ్డి, దేవస్థాన అధికారులు దయాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు