కొండెక్కిన కోడి

28 May, 2017 23:49 IST|Sakshi

ధర్మవరంటౌన్ : వారాంతపు సెలవు రోజుల్లో ఇంటిల్లిపాది సరదాగా చికెన్‌తో విందు భోజనం చేసుకుని తృప్తిపడతారు సామాన్య, మధ్య తరగతి ప్రజలు. అయితే ప్రస్తుతం ఆ సరదా కాస్త భారంగా మారింది. రెండింతలు పెరిగిన చికెన్‌ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణం, మండలం, తాడిమర్రి, ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో 300కు పైగా చికెన్‌« దుకాణాలు ఉన్నాయి. సగటున ఒక్కో దుకాణంలో రోజు వంద నుంచి 500 కేజీల వరకు చికెన్‌ను వ్యాపారులు విక్రయించేవారు.

అయితే ఇటీవల వేసవి కాలం రావడంతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఎండవేడిమికి కోళ్లపారంలో కోళ్లు ఎక్కువ శాతం చనిపోతున్నాయి. రవాణా ఖర్చులు, దాణా, కోళ్లఫారం నిర్వహణ వ్యయం పెరుగుతోంది. దీనికితోడు కార్పొరేట్‌ కంపెనీలు రంగ ప్రవేశం చేయడం కోళ్ల ఉత్పత్తిని చిన్నపాటి నిర్వాహకులు చేయలేని దుస్థితి రావడంతో వారు నిర్ణయించినదే రేటుగా మారింది. గడచిన మూడు నెలల క్రితం కిలో చికెన్‌ రూ.120 ఉంటే ప్రస్తుతం రూ.190 గరిష్ట ధరకు చేరింది. వచ్చే నెలలో మరికాస్త ధరలు పెరిగి  రూ.200 నుంచి రూ.220ల వరకు అధిక ధర చేరే అవకాశం ఉండటంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.  

నెల                           చికెన్‌ ధర  (కేజీ)
మార్చి                        రూ.110
ఏప్రిల్‌                        రూ.125
మే (మొదటివారం)        రూ.130
మే (రెండవ వారం)         రూ.150
మే (మూడవవారం)         రూ.170
ప్రస్తుత ధర                  రూ.190
                    
అరకిలోతో సరిపెడుతున్నాం
ఆదివారం వచ్చిందంటే కిలో చికెన్‌ కొనుక్కునే వాళ్లం. ప్రస్తుతం ధరలు అధికంగా పెరగడంతో అరకిలోతో సరిపెట్టాల్సి వస్తోంది. పేద, మధ్య తర గతి ప్రజలకు అందుబాటులో ఉండే చికెన్‌ధరలు అమాంతం పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయం.
–దస్తగిరి, చిరుఉద్యోగి, ధర్మవరం.

కోళ్ల ఉత్పత్తి తగ్గించిన కంపెనీలు
ప్రతి ఏడాదీ ఏప్రిల్, మేనెలల్లో పౌల్ట్రీఫారం నిర్వాహకులు ఉన్నపళంగా ఉత్పత్తి తగ్గిస్తారు. అరకొర ఉత్పత్తి చేసిన చోట కోళ్లు ఎండవేడిమితో చనిపోతాయి. దీంతో కోళ్లకు డిమాండ్‌ ఏర్పడుతుంది. దీనికి తోడు జిల్లాలో కోళ్లఫారాలు అరకొరగా ఉన్నాయి. కేవలం కర్ణాటక నుంచి మాత్రమే అధిక సంఖ్యలో కోళ్లను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దీంతో రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు అధికమవ్వడంతోనే చికెన్‌ధరలు పెరుగుతున్నాయి. మరో నెల రోజుల పాటు చికెన్‌ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
– మనోహర్, కోళ్ల వ్యాపారి, ధర్మవరం

మరిన్ని వార్తలు