పోలీసులు వెళ్లే సరికే.. పెళ్లైపోయింది

28 Apr, 2016 09:56 IST|Sakshi
పోలీసులు వెళ్లే సరికే.. పెళ్లైపోయింది

చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో బుధవారం పోలీసులు వెళ్లేసరికే ఓ బాలిక వివాహమైంది. భూదాన్ పోచంపల్లి మండలం రాంలింగంపల్లి గ్రామానికి చెందిన మంచాల కిషన్‌తో రేవనపల్లి గ్రామానికి చెందిన బాలిక(14)తో వివాహం నిశ్చయమైంది. పోచంపల్లిలో ఫంక్షన్‌హాళ్లు దొరకకపోవడంతో, చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ఫంక్షన్‌హాల్‌లో వివాహం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది.

పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్‌ఐ మల్లీశ్వరి హుటాహుటిన అక్కడికి వెళ్లింది. అప్పటికే పెళ్లితంతు పూర్తయ్యింది. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకున్న వారంతా పరారయ్యారు. పోలీసులు వెళ్లే సరికి వధూవరులు, బంధువులెవరూ లేరు. దీంతో ఆమె చిన్నకొండూరులో వెతికించగా, అబ్బాయి తండ్రి గండయ్య దొరికాడు. అతన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరువర్గాల పెద్దమనుషులు వచ్చి, పోలీసులతో మాట్లాడి, గండయ్యను తీసుకుని వెళ్లారు.
 

మరిన్ని వార్తలు