అమ్రాబాద్ : ఆ దంపతులది నిరుపేద కుటుంబం. అప్పటికే నలుగురు ఆడపిల్లలు.. పోషించే స్తోమతలేక ఐదో సంతానం తొమ్మిదిరోజుల పసికందును ఐసీడీఎస్కు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. అమ్రాబాద్ మండలం ఉప్పునుంతల (బీకే) కు చెందిన రాజేశ్వరి, బిలావత్ శివలాల్ స్థానికంగా కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇంతకుముందు నలుగురు కూతుళ్లు ఉండగా ఇద్దరు అనారోగ్యంతో మృతిచెందారు. అయినప్పటికీ మగబిడ్డ కోసం వేచి ఉన్నారు. ఐదో సంతానంగా తొమ్మిదిరోజుల క్రితం ఆడశిశువు జన్మించింది. దీంతో పోషించలేమని బాధ పడుతుండేవారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త సాజీదాబేగం నచ్చజెప్పినా వినలేదు. చివరకు శనివారం గ్రామానికి వచ్చిన ఐసీడీఎస్ సూపర్వైజర్ అమృతకు ఆ శిశువును అప్పగించారు. అనంతరం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడశిశువుకు వైద్యపరీక్షలు నిర్వహించి మహబూబ్నగర్లోని శిశువిహార్కు తరలించారు.