థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి

11 Jan, 2017 11:19 IST|Sakshi
థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి

గుంటూరు : మెగా ఫ్యాన్స్‌ అభిమానం హద్దు మీరింది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో చోటుచేసుకుంది. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో చిరంజీవి నటించిన  ఖైదీ నెంబర్‌ 150 చిత్రం బెనిఫిట్‌ షో వేస్తామని శ్రీనివాస థియేటర్‌ యాజమాన్యం తెలిపింది.

అయితే బుధవారం తెల్లవారుజాము వరకూ బెనిఫిట్‌ షో వేయకపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్‌లోని కుర్చీలతో పాటు స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఖైదీ నెంబర్‌ 150 చిత్రం ఇవాళ (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.