జన్మభూమి కమిటీ సభ్యురాలితో పాటు పలువురు చేరిక
పార్టీలోకి ఆహ్వానించిన పెద్దిరెడ్డి
చౌడేపల్లె: చౌడేపల్లె మండలం కాటిపేరి పంచాయతీ జన్మభూమి కమిటీ సభ్యురాలు, ఆమె భర్తతోపాటు పలువురు టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం చౌడేపల్లె మండలంలో గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపేరి పంచాయతీ జన్మభూమి కమిటీ సభ్యురాలు, టీడీపీ తరపున ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీచేసిన ఆర్.అన్నపూర్ణ, ఆమె భర్త ఆర్.వేణుగోపాల్, పెద్దగొర్నికుంట గ్రామ కమిటీ సభ్యుడు సి.చంద్రతోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు కూడా ఆపార్టీ విధివిధానాలతో విరక్తి చెంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధిక మెజార్టీ సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు.