చిత్తూరు, కర్నూలు జట్ల విజయం

20 Jul, 2016 17:53 IST|Sakshi
చిత్తూరు, కర్నూలు జట్ల విజయం

వైవీయూ :

కడప నగరం నిర్వహిస్తున్న అంతర్‌ జిల్లాల సీనియర్‌ మహిళా క్రికెట్‌ పోటీల్లో బుధవారం నిర్వహించిన మ్యాచ్‌లలో చిత్తూరు, కర్నూలు జట్లు విజయం సాధించాయి. నగరంలోని వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో కడప, చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. జట్టులోని నాగమణి 39 పరుగులు చేసింది. చిత్తూరు బౌలర్‌ శరణ్య 2, రమ 2 వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 49 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగుల విజయలక్ష్యం చేరుకుంది. జట్టులోని ప్రవళ్లిక 64 పరుగులు, శరణ్య 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దీంతో
చిత్తూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 4 పాయింట్లు పొందింది.
అనంతపురంపై కర్నూలు విజయం...
కేఎస్‌ఆర్‌ఎ క్రీడామైదానంలో అనంతపురం, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్‌గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 15.2 ఓవర్లలో 26 పరుగులకే ఆలౌట్‌ అయింది. కర్నూలు బౌలర్‌ అంజలి 8 వికెట్లు తీసి అనంతపురం జట్టును కుప్పకూల్చింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు కేవలం 3.4 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 29 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని శ్రావణి 20, అనూషారాణి 9 పరుగులతో సునాయాసంగా విజయలక్ష్యం చేధించారు. దీంతో కర్నూలు 10 వికెట్ల తేడాతో అనంతపురంపై ఘన విజయం సాధించింది. దీంతో కర్నూలుకు 4 పాయింట్లు లభించాయి.
 
 

మరిన్ని వార్తలు