కసి ఉంటే కష్టమేం కాదు

20 Jun, 2017 23:45 IST|Sakshi
కసి ఉంటే కష్టమేం కాదు
- ఇంగ్లిషు నేర్చుకోండి...మోజును తగ్గించుకోండి
- తెలుగుకే పరిమితమైతే అవకాశాలు రావనేది అపోహ
-  సివిల్స్‌ రాసే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నదే ఆకాంక్ష
- అందుకే విద్యార్థులను కలుసుకుంటున్నా...
- తెలుగు అకాడమీ అనువాదాలు విసృ‍్తతంగా చేపట్టాలి
– ‘సాక్షి’తో... సివిల్స్‌లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన రోణంకి గోపాల కృష్ణ
రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం:  సివిల్స్‌లో అఖిల భారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించడం జీవితంలో మరచిపోలేని రోజని రోణంకి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం సివిల్స్‌ రాస్తున్న విద్యార్థులను కలిసి సలహాలు, సూచనలిస్తూ వారిలో స్ఫూర్తిని రగిలించి ఏపీ నుంచి మరింతమంది సివిల్‌ ర్యాంకులను చూడాలన్నదే నా ఆకాంక్షని అన్నారు. అందుకే తనకున్న ఖాళీ సమయంలో ఇన్‌స్టిట్యూట్లకు వెళ్ళి విద్యార్థులను కలుసుకుంటున్నానని పేర్కొన్నారు. 
మంగళవారం రాజమహేంద్రవరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ... .
సాక్షి: సివిల్స్‌ రాయాలంటే ఆర్థికబలం ఉండాలా?
గోపాలకృష్ణ: ఆర్థికంగా కొంతైనా నిలదొక్కుకోవాలి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేయడం వల్ల శిక్షణకు, ఇతరత్రా మెటీరియల్‌, పుస్తుకాల కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులేమీ ఎదుర్కోలేదు. 
సాక్షి: కోచింగ్‌ సెంటర్లు మీ ఫొటోలతో ప్రచారం చేసుకుంటున్నాయని, దీనిపై మీ స్పందన?
గోపాల కృష్ణ:  నేనైతే ప్రత్యేకంగా ఏ శిక్షణా సంస్థలో కోచింగ్‌ తీసుకోలేదు. అయితే అన్ని కోచింగ్‌ సెంటర్లు నిర్వహించే మాక్‌ టర్వ్యూకు, మ్యూనికేషన్స్‌కు మాత్రమే హాజరయ్యాను. ఇక వారు నా ఫొటోను వాడుకుంటే అది వారి విచక్షణకే వదిలేస్తున్నాను.
సాక్షి: సివిల్స్‌ తెలుగు మాధ్యంలో రాస్తే లక్ష్యాన్ని సాధించవచ్చా?
గోపాలకృష్ణ:  అందుకు నేనే ఉదాహరణ. ప్రిలిమనరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూలో ఎలా నెగ్గుకు రాగలిగాను. మూడో ర్యాంకు ఎలా సాధింగలిగాను. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం.
సాక్షి: తెలుగు మాధ్యంలో మెటీరియల్‌ లభ్యం కావడం కష్టమంటారే?
గోపాలకృష్ణ:  నిజమే. ఇంగ్లిషు మెటీరియల్‌ను సంపాదించి తెలుగులో తర్జుమా చేసుకుని అధ్యయనం చేశాను.
సాక్షి:  మీరిచ్చే సూచనలేమిటి...?
గోపాలకృష్ణ: మనకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ ఉంది. వీరు చేయాల్సింది ఎంతో ఉంది.  సివిల్‌ సర్వీసుకు సంబంధించిన ఎథిక్స్, ఎకనామిక్స్‌, ఆప్టిట్యూడ్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితర పుస్తకాలు ఇంగ్లిషులో ఉన్నాయి. వీటిని తెలుగులో అనువదించేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ పని నేను చేయాలనుకుంటున్నాను. ఎంత వరకు సాధ్యపడుతుందో చూడాలి.
సాక్షి: సివిల్స్‌ రాసేవారికి మీరిచ్చే సూచనలు?
గోపాలకృష్ణ: సిలబస్‌ పట్ల కసితో కూడిన లక్ష్య నిర్దేశం ఉండాలి. పాత సివిల్‌ పరీక్షా పేపర్లను చదువుతూ ఉండాలి. వర్తమాన అంశాలపై బాగా అవగాహన ఉండాలి.
సాక్షి: ప్రజలకు ఏవిధమైన సేవలందిస్తారు?
గోపాలకృష్ణ: పేదప్రజలకు, అణగారిన వర్గాలకు సేవలందిస్తూ మంచిపేరు తెచ్చుకోవాలన్నది తన ఆకాంక్ష.
సాక్షి: మీ స్వగ్రామంలో మీ కుటుంబాన్ని వెలి వేశారు, భూమిని కబ్జా చేశారన్నారు కదా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?
గోపాలకృష్ణ: సివిల్స్‌ సాధించగానే గ్రామంలో సమస్యలన్నీ సమసిపోయాయి. అందరూ బాగానే ఉంటున్నాం. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం.
మరిన్ని వార్తలు