హైదరాబాద్: మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఒక్క ఏడాదిలో కేసీఆర్ 63 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నపరిశ్రమలకు ఇస్తానన్న 12వందల కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అందుకే వరల్డ్ బ్యాంక్ పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం కాదని నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. రైతులు చనిపోతుంటే సీఎం కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్లడం, రోమ తగులబడుతుంటే.. నీరో చక్రవర్తి పిడేలు వాయించినట్లుగా ఉన్నదని ఆరోపించారు. తాజా చైనా యాత్ర, గతంలో సింగపూర్ పర్యటనతో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు