మందమర్రి : సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసమే వెంకట్రావ్ టీబీజీకేఎస్లో చేరారని, ఆయన నాయకత్వంలోనే సింగరేణి కోల్మైన్స్ లేబర్ యూనియన్ మందమర్రి ఏరియా సంఘం పనిచేస్తోందని ఏరియా ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య స్పష్టం చేశారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కార్మిక క్షేత్రంలో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొనియాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల హక్కు రావాలంటే అది ఒక టీబీజీకేఎస్తోనే సాధ్యం అవుతుందని భావించిన వెంకట్రావ్ ఆ సంఘంలో చేరినట్లు ఆయన తెలిపారు.
వెంకట్రావ్ నాయకత్వంలో ఎస్సీఎల్యూ మొత్తం ఆయన వెంట వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తేజావత్ రాంబాబు, మేడ సమ్మయ్య, మడక శశిధర్, ప్రభాకర్ రావు, కడారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.