కూలిన నగరపంచాయతీ భవనం

3 Aug, 2016 19:12 IST|Sakshi
కూలిన నగరపంచాయతీ భవనం
హుజూరాబాద్‌: రెండు రోజులుగా కురుస్తున్న వానలకు హుజూరాబాద్‌ నగరపంచాయతీ పాత కార్యాలయ భవనం ముందు వరండా పూర్తిగా కూలింది. గతంలోనే ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో నూతనంగా నిర్మించిన భవనంలో పాలకవర్గం, కొంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరికొన్ని విభాగాలు పాతభవనంలోనే కొనసాగుతున్నాయి. ఎక్కువగా మహిళా సంఘాల సభ్యులు ఈ వరండా కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇది మంగళవారం అర్ధరాత్రి కూలడంతో పెద్ద ప్రమాదం తప్పినటై ్లంది. ఈ భవనాన్ని 1926లో నిజాం ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు సిల్వర్‌జూబ్లీ క్లబ్‌గా కొనసాగింది. 1942 నుంచి 1963 వరకు మున్సిపాలిటీ కార్యాలయంగా ఉండేది. తరువాత 1964లో మేజర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంగా మారింది. 2011లో హుజూరాబాద్‌ నగరపంచాయతీగా అవతరించిన తర్వాత కొత్త భవనాన్ని నిర్మించారు. పాత భవనంలో కొనసాగుతున్న విభాగాలను నూతన భవనంలోకి మార్చేందుకు చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌ వెంటనే చర్యలు చేపట్టారు. రెండు రోజుల్లో సిబ్బందికి గదులను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. 
 
 
మరిన్ని వార్తలు