ఎయిర్పోర్టుకు భూములు సేకరించండి
7 May, 2017 00:16 IST|Sakshi
కర్నూలు(అగ్రికల్చర్): ఓర్వకల్ విమానాశ్రయానికి అవసరమైన భూముల సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సంబందిత అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి శనివారం కలెక్టర్ తన చాంబరులో సమీక్ష నిర్వహించారు. బోగాపురం ఇంటన్నేషనల్ విమానాశ్రయం సీఈఓ వీరేంద్ర సింగ్.. ఇటీవలే కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు బొకే అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ భూముల సమీకరణపై సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయానికి 1000.10 ఎకరాల భూములు అవసరముండగా ఇప్పటి వరకు 638 ఎకరాల ప్రభుత్వ భూమిని సమీకరించి ఇచ్చామని, అసైన్ల్యాండ్స్ 83 ఎకరాలు అప్పగించామని, వీటికి సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చినట్లు కర్నూలు ఆర్డీఓ హుసేన్సాహెబ్ తెలిపారు. మిగిలిన భూములు ప్రయివేటు వ్యక్తుల నుంచి సమీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఓర్వకల్ తహసీల్దారు శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.