ప్రాధాన్యతా పనులకు ముందస్తు ప్రణాళిక

28 Nov, 2016 23:14 IST|Sakshi
ప్రాధాన్యతా పనులకు ముందస్తు ప్రణాళిక
కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌
కాకినాడ సిటీ : ఉపాధి హామీ, నీరు–చెట్టు పథకాల ద్వారా వచ్చే ఏడాది జల సంరక్షణ మిషన్‌ కింద జిల్లాలో చేపట్టే ప్రాధాన్యతా పనులకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కోర్టు హాలులో కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. పథకం కింద పనులను గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డిసెంబర్‌ ఒకటి నుంచి  నగదు రహిత విధానంలో రేషన్‌ సరుకుల పంపిణీకి రంగం సిద్ధం చేసి డీలర్లు, ప్రజలలో సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద రోడ్లు, హార్టికల్చర్, ఇరిగేషన్‌ తదితర అంశాల వారీగా నిర్వహించిన పనులు, నిధుల వినియోగంపై విశ్లేషణ చేసి నివేదిక సమర్పించాలని డ్వామా పీడీకి సూచించారు. జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు డిసెంబర్‌ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు పనితీరుపై నిర్దేశించిన కీ ఫెర్మార్మెన్స్‌ ఇండికేటర్ల సాధన నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుచేసి, గ్రేడింగ్‌లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని స్పష్టం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ, జాయింట్‌ కలెక్టర్‌–2 జె.రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు