-
ఉపాధ్యాయుడి తీరుపై మంత్రి చందూలాల్ ఆగ్రహం
-
మదనపల్లి యూపీఎస్ ఆకస్మిక తనిఖీ
ములుగు : ‘నీ జీతం ఎంత?’ మంత్రి చందూలాల్ ప్రశ్న. ‘సార్ రూ.40వేలు’ ఉపాధ్యాయుడి స మాధానం. ‘రూ.40వేలు తీసుకొని గాడిదలు కాయడానికి వచ్చావా?.. పిల్లలకు పాఠాలు చెప్పడానికి వస్తున్నావా?’ అంటూ మంత్రి తీ వ్రంగా మండిపడ్డారు. ములుగు మండలం మదనపల్లి యూపీఎస్ను శుక్రవారం మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో ఉపాధ్యాయుడు కుమారస్వామి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ హెచ్ఎం ఎక్కడా? అని మంత్రి ప్రశ్నించగా రాలేదని ఉపాధ్యాయు డు సమాధానం చెప్పాడు. దీంతో అటెండెన్స్ రిజిస్టర్ చూపించాలనడంతో ఒకరు తెచ్చి మం త్రికి ఇచ్చారు. అందులో ఇన్చార్జి హెచ్ఎం భవానీ పేరుతో సీఎల్ అని రాసి ఉంది. లీవ్ లెటర్ చూపాలని మంత్రి అడగ్గా తనతో ఫోన్ లో చెప్పిందని ఉపాధ్యాయుడు కుమారస్వామి సమాధానం చెప్పారు. లీవ్ లెటర్ లేకుండా లీవ్ ఎలా ఇచ్చారంటూ మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. అటెండెన్స్ రిజిస్టర్లో గురువారం ఉపాధ్యాయుడు కుమారస్వామి విధులకు హాజరు కాలేదు. ఎలాంటి లీవ్ లెటర్ లేదు. దీన్ని మంత్రి గుర్తించి ప్రశ్నించారు. అక్కడే ఉన్న గ్రామస్తులు వీరు విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని మంత్రికి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి హెచ్ఎం, ఉపాధ్యాయుల మధ్య పరిణామాలపై మంత్రికి వివరించారు. దీంతో ఆగ్రహించిన మంత్రి ఇన్చార్జి హెచ్ఎం భవానీ, ఉపాధ్యాయుడు కుమారస్వామిని సస్పెండ్ చేయాలని డీఈవో రాజీవ్ను ఫోన్లో ఆదేశించారు. డీఈఓ ఆదేశాల మేరకు ఇన్చార్జి ఎంఈఓ శ్రీనివాస్ నివేదిక ఇచ్చారు. అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయుల తీరుతో ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం పోతుందన్నారు. ఉదయం 8.45 గంటలకు పాఠశాలలకు చేరుకోవాల్సిన ఉపాధ్యాయులు కొందరు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు.
ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
విద్యారణ్యపురి : జిల్లాలోని ములుగు మం డలం మదనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం జి.భవానీ, ఎస్జీటీ కుమారస్వామిని డీఈఓ రాజీవ్ సస్పెండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి చందూలాల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఇన్చార్జి హెచ్ఎం జి.భవానీ విధులకు గైర్హాజరు కాగా ఎస్జీటీ కుమారస్వామి అటెండెన్స్ రిజిస్టర్లో సీఎల్ అని రాసినట్లు గుర్తించారు. లీవ్లెటర్ గురించి అడగ్గా లేకపోవడంతో వారిద్దరిని సస్పెండ్ చేయాలని అందులో రాశారు. ఈమేరకు వారిని డీఈఓ సస్పెండ్ చేశారు.