చూడాలంటే ఎన్నో కష్టాలు

18 Aug, 2016 22:46 IST|Sakshi
చూడాలంటే ఎన్నో కష్టాలు
హారతి చూసేందుకు  2 కి.మీ. నడవాల్సిందే 
రకరకాల ఆంక్షలు
భక్తులకు తీవ్ర ఇబ్బందులు 
ప్రాంగణమంతా ప్రభుత్వ సిబ్బందే 
 
పవిత్ర పుష్కరాల్లో చూసి తరించాల్సిందేనంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగమం హారతి కార్యక్రమం అధికారులకు, వీవీఐపీలకే పరిమితమా?, సామాన్య భక్తులను ఆంక్షల పేరుతో అనుమతివ్వడమే గగనమైంది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతోంది. 
 
విజయవాడ: పవిత్ర సంగమం వద్ద నిత్యహారతి కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. నగరంలో పలు ప్రాంతాలనుంచి భక్తులను సాయంత్రం బస్సులో ఇబ్రహీంపట్నం తరలిస్తున్నారు. సాయంత్రం హారతి సమయానికి ఒక గంట ముందు ఇబ్రహీంపట్నం రింగ్‌ వరకు మాత్రమే బస్సులను అనుమతిస్తున్నారు. అక్కడికి చేరుకున్న భక్తులను బస్సుల్లోంచి దించి కాలినడకన ఘాట్‌వద్దకు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. మొదటి ఐదు రోజులు ట్రాఫిక్‌ స్తంభించిపోవడంతో ఉచిత బస్సులపై ఆంక్షలు విధించారు. బస్సులను సాయంత్రం వేళల్లో అనుమతించకుండా శాటిలైట్‌ బస్‌స్టేషన్‌కు తరలిస్తున్నారు. బుడమేరు కట్టపై వేసిన రోడ్డుద్వారా ముఖ్యమంత్రి ఘాట్‌ వద్దకు చేరకుంటున్నారు. ఆ సమయంలో భక్తులను రింగ్‌ సెంటర్‌నుంచి కాలినడకన ఫెర్రీ రోడ్డులోకి పంపుతున్నారు. నవహారతులు చూడాలని వచ్చే భక్తులు ఘాట్‌ వద్దకు 2కి. మీ నడిచివెళ్లాల్సి వస్తోంది. దీంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. హారతి కార్యక్రమానికి చేరుకోలేక కొందరు ఉసూరంటూ వెనుదిరుగుతున్నారు. 
 
ముఖ్యమంత్రి వచ్చారా.. మరింత కష్టం 
ముఖ్యమంత్రి ఘాట్‌ వద్ద ఉన్న సమయంలో అయితే పరిస్థితి ఇంకా కష్టం. రకరకాల ఆంక్షలు విధించడంతో పాటు  పోలీసు, పారిశుధ్య, వైద్య సిబ్బందితోనే ప్రాంగణం కిక్కిరిసి పోతోంది. ఇక సమయానికి చేరుకోవడం దుర్లభమే. హారతి కోసం వచ్చే భక్తులు దూరం నుంచి చూసి వెనుదిరగాల్సి వస్తోంది. గత ఐదు రోజుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ముఖ్యమంత్రి వావానాలు నిలిపి ఉంచే చోట హారతి వీక్షించేందుకు వీలుగా చిన్న డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. అయినా ప్రత్యక్షంగా చూడడానికి వస్తే టీవీ తెరపై చూసి తిరిగి వెళ్లాల్సి వస్తోందని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని వార్తలు