కర్నూలు(అగ్రికల్చర్): సునయన ఆడిటోరియంలో ఓర్వకల్లు మండలం శకునాల, గడివేముల మండలం గని రైతుల భూములకు నష్ట పరిహారాన్ని చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్ పంపిణీ చేశారు. శకునాల గ్రామంలో 1100 ఎకరాలకు గాను 300 ఎకరాలకు ఇప్పటికే పరిహారం పంపిణీ చేశామన్నారు. మిగిలిన రైతుల్లో 500 ఎకరాలకు 278 మంది రైతులకు రూ.21 కోట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. గని గ్రామంలో 750 ఎకరాలకు గాను 300 ఎకరాలకు గతంలోనే పరిహారం ఇచ్చామని, ప్రస్తుతం 300 ఎకరాలకు 176 మంది రైతులకు రూ.13.50 కోట్లు పరిహారం చెక్కుల రూపంలో పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఓర్వకల్లులో త్వరలో విమానాశ్రయం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేత ప్రారంభిస్తామని కలెక్టర్ ప్రకటించారు. కార్యక్రమంలో జేసీ హరికిరణ్, ఏపీ సోలార్ కార్పోరేషన్ చీఫ్ విఎస్ఆర్ నాయుడు, ఎస్ఇ నారాయణమూర్తి, కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.