కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డీసీసీబీ) వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పలువురు డైరెక్టర్లు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం ఈ నెల 15న జరుగనుంది. ఇప్పటికే చైర్మన్ పదవితో పాటు పలు కీలక పదవులు నంద్యాల పార్లమెంటు నియోజక వర్గానికి ఉన్నందున వైస్ చైర్మన్ పదవిని కర్నూలు పార్లమెంటు నియోజక వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. నంద్యాల పార్లమెంటు నియోజక వర్గానికి చెందిన చల్లా రఘునాథరెడ్డి(అవుకు) వైస్ చైర్మన్ పదవి రేస్లో ఉన్నారు. తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ద్వారా వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఆయన ఉపముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం. అయితే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన డైరెక్టర్లలో ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సుధాకర్, బీసీ సామాజిక వర్గం నుంచి శ్రీనివాసులు, మైనార్టీ సామాజిక వర్గం నుంచి అహ్మద్హుసేన్లు ఎవ్వరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేఈ కుటుంబం ఆశీస్సులు ఉన్నవారికే వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది.