సందేశాత్మకంగా నాటిక పోటీలు

2 Apr, 2017 00:49 IST|Sakshi
సందేశాత్మకంగా నాటిక పోటీలు
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం బీవీఆర్‌ కళాకేంద్రంలో జాతీయ ఉగాది నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. సముద్ర తీరంలోని సైకత శిల్పం అందంగా ఉంటుంది. అలల తాకిడికి కరిగిపోతుంది. అలల్లో కలిసిపోతుంది. అలానే యువతీ యువకులు భ్రమల్లో బతుకుతున్నారు, వివాహబంధాలను వినాశనం చేసుకుంటున్నారు. ఆకర్షణలకు పోయి వాస్తవాలను విస్మరించి అపోహలతో సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారనే సందేశంతో కళా రాధన (నంద్యాల) కళాకారులు ‘సైకత శిల్పం’ నాటికను ప్రదర్శించారు. వివాహ బంధం అలలకు కరిగిపోయే సైకత శిల్పంలా కాకుండా సజీవ శిల్పంలా దృఢంగా నిలవాలని చాటిచెప్పారు. పిల్లలపై తల్లిదండ్రులు చూపే ప్రేమలో పరిమితి ఉండదనే సందేశంతో సాయి ఆర్ట్స్‌ (కొలుకులూరు) కళాకారులు ‘చాలు–ఇక చాలు’ నాటిక ద్వారా చాటిచెప్పారు. ముందుగా కర్నూలు జిల్లా బనగానపలి్లకి చెందిన కె.అంజలీనాథ్‌ ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నంద్యాలకు చెందిన సుంకర రాజశేఖర ప్రసాద్‌కు జీవన సాఫల్య ఉగాది పురస్కారాన్ని అందజేశారు. బీవీఆర్‌ కళాకేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు