ప్రేమ పెళ్లి చేసుకుని ఇష్టం లేదంటున్నాడు

22 Apr, 2017 00:27 IST|Sakshi
- యువకుడిపై యువతి ఫిర్యాదు
- ఐదుగురిపై కేసు నమోదు
   
పాములపాడు:  ప్రేమించి పెళ్లి చేసుకుని ఆతర్వాత ఇష్టం లేదని చెప్పిన యువకుడిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువకుడితో పాటు అతని కుటుంబీకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేంపెంట గ్రామానికి చెందిన అజయ్‌నాయక్‌,  అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ విద్యార్థిని ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరని మార్చి 27న ఇద్దరు ఇంట్లోంచి వెళ్లిపోయారు. నంద్యాలలో అదే గ్రామానికి చెందిన వారికి వీరిరువురు తారస పడటంతో ఇరు కుటుంబాలు ఘర్షణ పడుతున్నాయని, ఇంటికి వెళ్లండని సర్దిచెప్పటంతో సొంత ఊరుకు చేరుకున్నారు. యువతి ఇంటికి వెళ్లగా మొదట తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు. తన ప్రియుడు అజయ్‌ ఇంటికి వెళ్లగా ‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. ఇంట్లోకి రావద్దంటూ’ తేల్చి చెప్పాడు. కొన్ని రోజులకు మారి తనను పెళ్లి చేసుకుంటాడులే అని భావించిన యువతి మళ్లీ తల్లిదండ్రులను ఆశ్రయించింది. రోజులు గడుస్తున్నా అజయ్‌ నాయక్‌లో మార్పు రాకపోవడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజయ్‌నాయక్‌ తండ్రి లక్ష్మన్‌నాయక్, తల్లి సుభద్రాబాయి, అక్క శైలజాబాయి, చిన్నాన్న స్వామన్ననాయక్‌ల బెదిరించడంతోనే ఇష్టం లేదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సుధాకరరెడ్డి శుక్రవారం తెలిపారు.    
 
మరిన్ని వార్తలు