కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కాంట్రాక్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు శ్రీరాములు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశారు. ఆర్యూలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తిలోదకాలిచ్చారని, అనర్హులకు, రాజకీయ ఒత్తిళ్లకు లోనై పోస్టు భర్తీ చేసేలా వైస్ చాన్సలర్ చర్యలున్నట్లు కానవస్తున్నాయని ఆరోపిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ జయరాజు, కార్యదర్శి వరదరాజు, వైస్చైర్మన్ నరసింహవర్మలను కలిసి వినతిపత్రం అందజేసినట్లు విద్యార్థి సమాఖ్య నాయకులు తెలిపారు. స్పందించిన అధికారులు వర్సిటీలో చేపట్టిన అన్ని నియామకాలపై విచారణ చేపడతామని హామీనిచ్చినట్లు వారు పేర్కొన్నారు.