థియేటర్లలో ప్రమాణాలు పాటించాలి : జేసీ

26 May, 2017 23:57 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : సినిమా థియేటర్లలో ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి వాటి యాజమానులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం ఆమె డీఆర్వో సి.మల్లీశ్వరిదేవితో కలిసి జిల్లాలోని సినిమా థియేటర్ల యజమానులు, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. థియేటర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు వివిధ శాఖల నుంచి అనుమతులను సకాలంలో పొందాలని ఆదేశించారు.

ఆన్‌లైన్‌ అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్లను కొంత మేర విక్రయించుకుని మిగిలినవి తప్పనిసరిగా థియేటర్‌ బుకింగ్‌ కౌంటర్లలోనే విక్రయించాలన్నారు. బహిరంగ ధూమపానం, ఉమ్మి వేయుటను కఠినంగా నిషేధించాలని ఆదేశించారు. తినుబండారాల ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించి ఆ ధరలకే విక్రయించాలన్నారు. అధిక ధరలు వసూలు చేసినా, కాలపరిమితి దాటిన వాటిని విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. థియేటర్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమావేశంలో అనంతపురం, కళ్యాణదుర్గం ఆర్డీఓలు మలోల, రామారావు, ధియేటర్ల యజమానులు, మేనేజర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు