నయీం కేసుల గందరగోళం

3 Jan, 2017 02:59 IST|Sakshi
నయీం కేసుల గందరగోళం

గ్యాంగ్‌స్టర్‌ నయీం హతమైనా పోలీసు కేసుల నమోదు, దర్యాప్తు తీరు చర్చే అవుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో గతేడాది ఆగస్టు 8న జరిగిన ఎన్‌కౌంటర్‌లో నయీం మృతి చెందిన విషయం తెలి సిందే. అయితే నయీం మరణాంతరం విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదు చేసింది. ఇదే క్రమంలో కరీంనగర్, జగ్యితాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఐదు కేసులు నమోదయ్యాయి. పలుచోట్ల సుమోటో కింద కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే సిట్‌ కేసుల నమోదు, దర్యాప్తు సందర్భంగా అనేక చిత్ర విచిత్రాలు జరగడం చర్చనీయాంశం అవుతోంది.

సాక్షి, కరీంనగర్‌ : జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీసు స్టేషన్‌పరిధిలో గ్యాంగ్‌స్టర్‌ నయీంకు సంబంధించి రెండు కేసులు నమోదు కాగా.. ఒక కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టులో చార్జీషీటు దాఖలు చేశారు. పోలీసులు రౖకైం నంబర్‌ 178/2016 నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఆగస్టు 30న నిందితులైన కోరబోయిన రమేశ్‌ అలియాస్‌ రాంబాబు, నర్సింగోజు గోవర్ధనచారి అలియాస్‌ గోపీలను కోర్టు అనుమతితో జుడీషియల్‌ కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టగా మరో నేరానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీంతో అక్కడి ఎస్సై సుమోటో కేసు ్రౖకైం నంబర్‌ 193/2016 నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడు నయీం కాగా.. కోరబోయిన రమేశ్, నర్సింగోజు గోవర్ధ్దనచారి, కట్టశివతో పాటు ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ జారీ చేశారు. దీనిపై ఐపీసీ సెక్షన్‌ 120, 384, 302 రెడ్‌విత్, 120బీ అండ్‌ 34 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో పేర్కొన్న ప్రధాన నిందితుడైన నయీం మరణించగా.. నాల్గో నిందితుడు కోరు ట్ల పోలీసులకు లొంగిపోయాడు.

జుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులు రమేశ్, గోపిలను కస్టడీకీ తీసుకొని విచారించారు. కేసు వివరాల్లోకి వెళ్తే కోరుట్ల పట్టణానికి చెందిన బీడీ    లీవ్స్‌కాంట్రాక్టర్‌ ఖుర్రంను బెదిరించి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేయాలని నయీం ఆదేశాల మేరకు నిందితులందరు కలిసి కుట్ర పన్నారని, దీంతో నయీం ఆదేశాల మేరకు మిగతా నిందితులు కోరుట్లకు చేరుకొని ఖుర్రంను నయీంను కలువాలని లేకుం టే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఖుర్రం నయీంను కలవడానికి నిరాకరించాడు. ఈ విషయాన్ని నిందితులు నయీంకు తెలుపగా అతను ఖుర్రం సోదరుడైన అస్లాం వివరాలు, ఫొటోలు సేకరించి అస్లాంను చంపడానికి కుట్ర పన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీ సులు 14 మంది సాక్షుల పేర్లు తెలుపుతూ కోర్టులో నయీంతో పాటు గోపీ, రమేశ్, శివలపై కోరుట్ల జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సీఐ చార్జీషీట్‌ దాఖ లు చేయగా దర్యాప్తు వివరాలన్ని వెలుగుచూశాయి. ఈ కేసును పకడ్బందీగా దర్యాప్తు చేశారని అందరూ భావిస్తుంటే ఇందులో నిందితులుగా పేర్కొన్న అభియోగాలపై, ఐపీసీ సెక్షన్లపై న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇందులో నిందితులు  బలవంతంగా డబ్బు రాబ ట్టాలని కుట్రపన్నినట్లు తెలుస్తుండగా హత్యానేరం కింద ఐపీసీ 302 సెక్షన్‌ ఎలా నమోదు చేశారని చర్చనీయాంశమైంది.

 ఏదైనా హత్య జరిగితే న్యాయస్థానం నిందితున్ని ఐపీసీ సెక్షన్‌  302 కింద శిక్షిస్తుంది. ఈ కేసులో పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయగా చార్జీషీట్‌లో చనిపోయిన వ్యక్తి ఎవరు, అతని పేరు తెలుపలేదు. నిందితుల్లో ఎవరు హత్య చేశారు, ఆ సంఘటనకు సంబంధించిన ఎలాంటి వివరాలు లేవు. ఏదైనా హత్య కేసు నమోదయి తే చనిపోయిన వ్యక్తి వివరాలు, శవపంచనామా, హత్యకు ఉపయోగించిన ఆయుధాల సేకరణ, పోస్టుమార్టం రిపోర్టుతోపాటు వివరంగా ఘటనకు సంబంధించిన అన్ని విషయాలతో కూడిన చార్జీషీట్‌ను విచారణాధికారి కోర్టుకు సమర్పిస్తారు. కానీ ఈకేసులో పైన తెలిపినవేవి కూడా చార్జీషీట్‌లో పేర్కొనకపోవడంతో నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 302 ఎలా నమోదు చేసి చార్జీషీట్‌ దాఖలు చేశారన్న విషయంపై న్యాయవాద వర్గాల్లో గతవారం రోజుల నుంచి చర్చ జరుగుతోంది. నిందితులైన రమేశ్, గోపీలకు మిగతా కేసులలో బెయిల్‌ మంజూరైనప్పటికీ ఈ కేసులో ఐపీసీ సెక్షన్‌ 302 నమోదైనందు వల్ల బెయిల్‌రాక సుమారు నాలుగు నెలలుగా జైలులోనే ఉంటున్నట్లు వారి తరఫు లాయర్‌ పేర్కొన్నారు. నిందితులు ఎవరినైతే చంపాలని కుట్రపన్నామని  తెలిపారో అతడిని కేసులో 3వ సాక్షిగా పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది.

మరిన్ని వార్తలు