ఈ-వేబిల్స్‌తో గందరగోళం

2 Jul, 2017 22:45 IST|Sakshi
ఈ-వేబిల్స్‌తో గందరగోళం
ఆదోని అర్బన్‌: జీఎస్‌టీ అమల్లోకి రావడంతో వెబ్‌లో ఈ వేబిల్‌ ఆప్షన్‌ను తొలగించడంతో పట్టణ వ్యాపారస్తుల్లో గందరగోళం నెలకొంది. వేబిల్స్‌ ఆప్షన్స్‌ లేకపోవడంతో సరుకును ఇతర ప్రాంతాలకు పంపడానికి ఇక్కట్లు ఎదరవుతున్నాయని వారు వాపోతున్నారు. పట్టణంలో రోజూ రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. ఇక్కడి నుంచి పలు రకాల సరుకులను, ముడిపదార్థాలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ముఖ్యంగా పత్తి. అయితే వాహనాల్లో తరలించడానికి వేబిల్‌ అవసరం. ఇప్పటి వరకు వేబిల్‌తోనే ఎగుమతులు జరిగేవి. అయితే ప్రస్తుతం వేబిల్‌ ఆప్షన్‌ లేకపోవడంతో వాణిజ్య పన్నుల అధికారులు తనిఖీలు చేస్తే వేబిల్‌ లేకపోవతే భారీ స్థాయిలో జరిమానాలు విధించే అవకాశుముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 30న  సాక్షి ఆధ్వర్యంలో జరిగిన జీఎస్టీపై అవగాహన సదస్సులో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ గీతా మాధురి వ్యాపారస్తులకు సందేహాలను నివృతి చేశారు. అయితే జీఎస్టీ వస్తే వేబిల్స్‌ ఎలా అని వ్యాపారస్తులు ప్రశ్నించగా పాత వేబిల్స్‌ ఉంటాయని చెప్పారని, ఇప్పుడు ఆ ఆప్షనే లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు.  
 
ఇన్వాయిస్‌ బిల్లులు రెండు కాపీలు పంపించండి – మురళీధరన్, వాణిజ్య పన్నుల శాఖ అధికారి–1
చెక్‌పోస్టులన్నీ ఎత్తివేశారు. ఈ వేబిల్‌ ఆప్షన్‌ కూడా లేదు. మూడు నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. అంతవరకు వేచి ఉండాలి. అత్యవసరంగా సరుకులు పంపాలంటే వేబిల్‌ బదులుగా ఇన్వాయిస్‌ బిల్లు ఒరిజినల్, డూబ్లికేట్‌ ఒక్కోటి పంపించాలి. జీఎస్టీ ఉందని అధికారులకు తెలుసు. ఎవరూ పట్టుకోరు. ఒక వేళ పట్టుకున్నా తన సెల్‌ 9949992638 కు ఫోన్‌ చేస్తే సమస్యను పరిష్కరిస్తాం. ఆందోళన  చెందాల్సిన అవసరం లేదు. 
 
>
మరిన్ని వార్తలు