నందికొట్కూరు: విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన కానిస్టేబుల్ చెరకు శాంతకుమార్(42)కు అధికార లాంఛనాలతో ఆదివారం నందికొట్కూరులో అంత్యక్రియలు నిర్వహించారు. జూపాడుబంగ్లా పోలీసు స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ శనివారం కడప జిల్లా సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదివారం ఉదయం కానిస్టేబుల్ మృతదేహానికి డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, ఎమ్మెల్యే ఐజయ్య పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతక్రియల ఖర్చుల కింద మృతుడి భార్యకు ఎస్పీ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం డీఐజీ రమణకుమార్ మాట్లాడుతూ కడప జిల్లాలో సీఎం బందోబస్తులో విధులు నిర్వర్తిస్తుండగా తన కళ్ల ఎదుటనే ఈ సంఘటన చోటు చేసుకోవడం తనను మానసికంగా చాలా బాధించిందని కన్నీరు పెట్టుకున్నారు. సీఎంతో వెంటనే చర్చించి రూ, 10 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా ఒప్పించినట్లు తెలిపారు. కాగా మృతుడి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించేలా సీఎంకు లేఖ రాస్తానని, మీరు కూడా సీఎం చర్చించి న్యాయం జరిగేలా చూడాలని డీఐజీకి విన్నవించారు. అంత్యక్రియలకు సీఐ శ్రీనాథరెడ్డి, ఎస్ఐలు జాన్, లక్ష్మీనారాయణ, సుబ్రమాణ్యం, అశోక్, రాజ్కుమార్, నరసింహులు, పోలీసులు హాజరయ్యారు.