వంట గ్యాస్‌కు నగదు రహిత బదిలీలు

12 Dec, 2016 15:02 IST|Sakshi
వంట గ్యాస్‌కు నగదు రహిత బదిలీలు
ఎల్‌పీజీ డీలర్లకు జేసీ సత్యనారాయణ ఆదేశం
కాకినాడ సిటీ : గ్యాస్‌ వినియోగదారుల సౌకర్యార్థం ఎల్‌పీజీ డీలర్లు విధిగా నగదు రహిత బదిలీలు నిర్వహించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్‌ కోర్టు హాలులో ఎల్‌పీజీ డీలర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో నగదు సర్క్యులేషన్‌ లేక మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలు తక్కువగా ఉన్నాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత బదిలీలు, స్వైపింగ్, యాప్‌ల డౌన్‌లోడ్‌ల ద్వారా నగదు బదిలీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టిందని చెప్పారు. జిల్లాలో 13 లక్షల గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారని, వీరందరికీ ఆధార్, బ్యాంక్‌ ఖాతా సీడింగ్‌ జరిగిందన్నారు. వీరందరికీ నగదు రహిత బదిలీ చేయాల్సిన అవసరం ఉందని,  దీని వల్ల లబ్ధి ఉంటుందన్నారు. ఈ పోస్‌ మెషీన్‌ ద్వారా స్వైపింగ్‌ ఆంధ్రా బ్యాంక్‌ బిజిలీ యాప్, స్టేట్‌బ్యాంక్‌ బడ్డీ, ఎం–పే యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుని నెట్‌ కనెక్టివిటీ ఉంటే వీటిని నిర్వహించుకోవచ్చున్నారు. డెలివరీ బాయస్‌కు యాప్‌లు, స్వైప్‌లపై అవగాహన కల్పించాలని చెప్పారు. స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే దానికి స్వైపింగ్‌ కనెక్టివిటీ ఇస్తారని, దాన్ని మొబైల్‌గా ఉపయోగించి నగదు బదిలీ చేయవచ్చన్నారు. యాప్స్‌ అయితే వినియోగదారులు, డీలర్లు ఇద్దరూ డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే నగదు రహిత బదిలీకి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్‌బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్‌ ప్రతినిధులు యాప్‌ల డౌన్‌లోడ్, స్వైపింగ్‌లపై డీలర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ జి.ఉమామహేశ్వరరావు, డీఎం ఎ.కృష్ణారావు, నాబార్డ్‌ ఏజీఎం ప్రసాద్, ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులు, ఎల్‌పీజీ డీలర్లు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు