ఖమ్మం జెడ్పీసెంటర్:
సాదాబైనామాలో భూమి హక్కు కల్పించాలని వచ్చిన దరఖాస్తులను తక్షణమే ఆన్లైన్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. సాదాబైనామా దరఖాస్తులపై తహసీల్దార్లతో మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. దరఖాస్తులను పరిశీలించి స్పష్టంగా ఉన్న దరఖాస్తులను 11, 12 ఫారాలలో పొందుపరిచి.. ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. దీనికి తహసీల్దార్లు విధిగా హాజరుకావాలని ఆదేశించారు. భూములకు నాలుగు వైపులా హద్దులను పరిశీలించి స్టేట్మెంట్ నమోదు చేయాలన్నారు. ఇతర మండలాల దరఖాస్తులు వస్తే సంబంధిత మండలాలకు పంపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,01,762 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఇప్పటి వరకు 68,915 దరఖాస్తులు ఆన్లైన్ చేసినట్లు చెప్పారు. మిగిలిన దరఖాస్తులను బుధవారం సాయంత్రానికి ఆన్లైన్ పూర్తి చేయాలన్నారు. చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం నల్లబజార్కు తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల 30 వ తేదీన పౌరహక్కుల దినోత్సవాన్ని విధిగా నిర్వహించాలన్నారు. మీసేవా కేంద్రాల యాజమానులు 21న హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులకు నివేదిక అందజేయాలన్నారు. ఈ వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ పాల్గొన్నారు.