సైన్స్‌తోనే దేశం అగ్రగామి

27 Jan, 2017 22:22 IST|Sakshi
సైన్స్‌తోనే దేశం అగ్రగామి
 -విద్యార్థులు పరిశోధనలు వైపు
  అడుగులు వేయాలి
- ప్రముఖ శాస్త్రవేత్త పిలుపు
-ఆర్‌యూలో అట్టహాసంగా
  సైన్స్‌ ఇన్‌స్పైర్‌ ప్రారంభం
 
 
కర్నూలు(ఆర్‌యూ):  సైన్స్‌తోనే దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని బాబా అటామిక్‌ ఎనర్జీ ముంబాయి శాస్త్రవేత్త ఎ.వి.రెడ్డి, హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ అభినయ్‌ సమంత  అన్నారు. విద్యార్థులు పరిశోధన వైపు ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలో శుక్రవారం ఇన్‌స్పైర్‌ ఇంటర్న్‌షిప్‌ సైన్స్‌ క్యాంప్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. వర్సిటీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి  వారు అతిథులుగా హాజరై మాట్లాడారు. మన శాస్త్రవేత్తలు దేశం గర్వపడేలా 103 ఉపగ్రహాలను త్వరలో ప్రయోగించనున్నారని చెప్పారు. కెమిస్ట్రీలో ఎగ్జ్జైట్‌మెంట్‌ ఇన్‌ సైన్స్‌ అనే అంశంపై  ప్రొఫెసర్‌ సమంత ఉపన్యాసించారు.
 
 విద్యార్థులకు సైన్స్‌ పట్ల అవగాహన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పరిశోధన రంగాల్లో విద్యార్థుల పాత్ర, ప్రభుత్వ ఆలోచన విధానం తదితర విషయాలను వివరించారు. న్యూక్లియర్‌ రంగంలో అధునాతన పరిశోధనల గురించి శాస్త్రవేత్త ఏవీరెడ్డి వెల్లడించారు. అకర్బన రసాయన శాస్త్రంలో కొన్ని ప్రయోగాలను విద్యార్థులతో చేయించి వారిని ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో ఆర్‌యూ  వైస్‌ చాన్స్‌లర్‌ నరసింహులు, రిజిస్ట్రార్‌ బి.అమర్‌నాథ్, సమన్వయకర్త ఎస్‌.రమణయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
నేటి కార్యక్రమాలు 
రెండో రోజు శనివారం హైదరబాద్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డి.రామాచారి పాల్గొని కర్బన రసాయన శాస్త్రంలో ఔషధాల తయారీ ప్రాముఖ్యత, వాటిని ప్రయోగించాల్సిన పద్ధతులను వివరించి ప్రయోగాలు చేసి చూపించనున్నారు. అంతేకాక ప్రొఫెసర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌ హెచ్‌సీయూ  కెమిస్ట్రీ విభాగం నుంచి నానో పదార్థాల మీద జరిగే పరిశోధనలు, ప్రపంచంలో నానో రంగంలో జరుగుతున్న అధునాతనమైన పద్ధతులను తెలియజేస్తారు.
 
హెచ్‌సీయూ వీసీ పర్యటన రద్దు..ఊపిరి పిల్చుకున్న పోలీసులు
సైన్​‍్స ఇన్‌స్పైర్‌కు  హెచ్‌సీయూ వైస్‌ చాన్స్‌లర్‌ అప్పారావు హాజరవుతున్నారని విద్యార్తి సంఘాలకు సమాచారం అందిందిం. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణమైన ఆయనను ఎలాగైనా అడ్డుకోవాలని విద్యార్థులు వర్సిటీ గేట్ల ఎదుట బైఠాయించారు. ఈవిషయం తెలిసి ఆర్‌యు అధికారులు వర్సిటీ క్యాంపస్‌లో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. అయితే, ఉన్నట్టుండి అప్పారావు తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలియడంతో పోలీసులు, ఆర్‌యూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థి మ​ృతికి  కారణమైన అప్పారావును ఆహ్వానించిన ఆర్‌యూ వీసీ నరసింహులు వైఖరికి ఎస్‌ఎఫ్‌ఐ, కేవీపీఎస్, ఆర్‌పీఎస్‌ ఎస్‌ఎఫ్, ఏఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులంతా  నల్ల బ్యాడ్జీలు ధరించి  నిరసన వ్యక్తం చేశారు. 
 
>
మరిన్ని వార్తలు