♦ భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
♦ అనాథగా మారిన కుమారుడు శ్రీకాంత్
♦ తిరుమలగిరి మండలంలో ఘటన
♦ కుటుంబ కలహాలతో భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
తిరుమలగిరి (నాగార్జునసాగర్) :
కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. భార్య మతి చెంది, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన తిరుమలగిరి మండలం నెల్లికల్ గ్రామపంచాయతీ పరిధిలోని జాల్తండాలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వివరాల ప్రకారం.. జాల్తండాకు జటావత్ రవీందర్(35)కు తొమ్మిది సంవత్సరాల క్రితం పీఏపల్లి మండలం బూడిదగట్టు తండాకు చెందిన బుజ్జి (27)తో వివాహం జరిగింది. రవీందర్, బుజ్జి దంపతులకు మొదటి మూడు కాన్పుల్లో ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు. నాలుగో కాన్పులో మగపిల్లాడు జన్మనించడంతో వారు ఆ పిల్లాడిని అల్లారుముద్డుగా పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
చిచ్చుపెట్టిన అనుమానం..
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేస్తున్న చీరలను తెచ్చుకోవడానికి బుజ్జి సోమవారం నెల్లికల్ వెళ్లింది. బుజ్జి ఆలస్యంగా ఇం టికి రావడంతో ఇంతసేపు ఏంచేశావ్.. ఎక్కడికి వెళ్లావంటూ భర్త రవీందర్ బుజ్జిని చితకబాది తన పొలం వద్దకు వెళ్లాడు. మనస్తాపానికి గురైన బుజ్జి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. చుట్టుపక్కల వారు గమనించి బుజ్జిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నాగార్జునసాగర్ తరలించారు.
మనస్తాపానికి గురైన భర్త..
భార్యపై చేయిచేసుకోవడంతో రవీం దర్ మనస్తాపానికి గురై తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇంటికి వచ్చి తాను పురుగుల మందు తాగానని చెప్పడంతో గ్రామస్తులు రవీందర్ను నాగార్జునసాగర్ తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తల్లి ఆత్మహత్య, తండ్రి అసస్శారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో.. కుమారుడు శ్రీకాంత్ అనాథగా మారాడు. ఏమీ తెలియక బాలుడు అమ్మేది అంటూ తన కుటుంబ సభ్యులను అడిగిన తీరు అక్కడివారిని కంటనీరు పెట్టించింది.
శ్రీకాంత్ను కూడా చంపేవారా..
శ్రీకాంత్ నెల్లికల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం శ్రీకాంత్ పాఠశాలకు వెళ్లాడు. శ్రీకాంత్ పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దే ఉంటే మనస్తాపానికి గురైన ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆ దంపతులు పిల్లవాడిని కూడా విగతజీవిగా మార్చేవారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.