-

దంపతులను కత్తితో పొడిచి..

19 Jul, 2016 22:51 IST|Sakshi
దంపతులను కత్తితో పొడిచి..

రూ. 5 వేల దోపిడీ
ఆత్మకూర్‌(ఎం)లో దుండగుడి హల్‌చల్‌
ఆత్మకూరు(ఎం):
మండల కేంద్రంలో సోమవారం రాత్రి ఓ దుండగుడు హల్‌చల్‌ సృష్టించాడు. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులపై దాడి చేసి రూ. 5 వేలు దోచుకుపోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లోడి సోమయ్య, లోడి రాములమ్మ దంపతులు ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రిదుండగుడు ప్రహరీ ఎక్కి స్లాబ్‌ మీదుగా ఇంట్లోకి ప్రవేశించాడు.  బీరువాను తెరిచి అందులో ఉన్న వస్తువులను చిందరవందరగా చేశాడు. రూ. 5 వేల నగదును అపహరించాడు. తర్వాత మంచంపై పడుకున్న రాములమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసు పుస్తెల తాడును లాక్కొనే ప్రయత్నం చేస్తుండగా ప్రతిఘటించింది. దీంతో దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో మెడపైభాగాన పోడిచాడు. సమీపంలోనే మంచం మీద పడుకున్న సోమయ్య మేల్కొని అడ్డురావడంతో అదే కత్తితో చాతి, మెడపై భాగాన పొడిచాడు. కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారి అలికిడి విని ఆ దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.  స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ పి. శివనాగప్రసాద్‌ అక్కడకు వచ్చారు.  తీవ్ర గాయాలు అయిన సోమయ్య, రాములమ్మలను చికిత్స నిమ్తితం 108 అంబులెన్స్‌లో ఎల్‌బీ నగర్‌ కామినేని ఆస్పత్రికి తరలించారు.
జాగిలాలతో గాలింపు
దుండగుడి ఆచూకీ కోసం క్లూస్‌టీంను రంగంలోకి దిగారు. బీరువాపై ఉన్న వేలు ముద్రలను సేకరించారు. దుండగుడు అక్కడే వదిలేసిన చెప్పుల వాసనతో పోలీసు జాగీలంతో గాలింపును మొదలు పెట్టారు.  పోలీసు జాగిలం మొరిపిరాల రోడ్డు మార్గాన పరిగెత్తి అక్కడ నుంచి ఇసుక ట్రాక్టర్‌ల బాట గుండా బిక్కేరు వాగు మీదుగా చిన్న గూడెం నుంచి మొరిపిరాల మీదుగా కాల్వపల్లి రోడ్డు వైపు అటు నుంచి తిరిగి మొరిపిరాల బండ వరకు వచ్చి ఆగిపోయింది. సంఘటన స్థలాన్ని యాదగిరిగుట్ట డీఎస్పీ సాదు మోహన్‌రెడ్డి, రామన్నపేట సీఐ ఎం. శ్రీదర్‌రెడ్డి, ఎస్‌ఐ పి. శివనాగప్రసాద్‌ సందర్శించి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.

 

మరిన్ని వార్తలు