♦ రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
♦ నెట్టేకల్లులో విషాదం
ఆదోని టౌన్ : పట్టణ శివారులోని నెట్టేకల్ క్రాస్ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తాలూకా సీఐ దైవప్రసాద్ వివరాల మేరకు నెట్టేకల్కు చెందిన గొల్ల వీరారెడ్డి(35) తన భార్య సునీత(32)తో బైక్పై ఆదోనికి వచ్చారు. అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. నెట్టేకల్ క్రాస్ సమీపంలోకి రాగానే ఎమ్మిగనూరు వైపు నుంచి ఏపీ21 బిజే 4612 షిప్ట్ డిజైర్ కారు అతివేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. బైక్పై నుంచి కిందపడడంతో తీవ్రగాయాలైన వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదేవేగంతో ముందుకు దూసుకెళ్లగా ముందున్న మూడుబైకులు నుజ్జనుజ్జయ్యాయి.
కారు అలాగే ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఉన్న శ్రీరామ టిఫిన్ సెంటర్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన టిఫిన్ సెంటర్ నిర్వాహకులు రవి, జయశ్రీ దంపతులు తమ చిన్నారితో అక్కడి నుంచి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కారులో ఉన్న పట్టణానికి చెందిన మంజు అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. వారు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
భార్య వైద్యం కోసం వచ్చి..: గొల్ల వీరారెడ్డి తన భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్యం కోసం ఆదోనికి వచ్చారు. అనంతరం స్వగ్రామానికి వెళుతుండగా కారు రూపంలో మృత్యువు వారిని కబళించింది. తాలూకా సీఐ దైవప్రసాద్, ట్రాఫిక్ సీఐ శంకరయ్య, ఎస్ఐలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. భార్యాభర్తల మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో మృతుల బంధువులు, స్నేహితులు రోదనలు మిన్నంటాయి. మృతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.