కరెంటు ‘కాటే’స్తోంది!

7 Aug, 2016 21:42 IST|Sakshi
విద్యుదాఘాతంతో మృతిచెందిన రైతు(ఫైల్‌)
  • ప్రమాదాల బారిన రైతన్నలు, మూగజీవాలు
  • పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు
  • వానకాలంలో మరింత ప్రమాదం
  • జిల్లాలో ఏటా పెరుగుతున్న దుర్ఘటనలు
  • సిద్దిపేట రూరల్‌: వర్షాకాలంలో ఇళ్లు, పొలాలు, బావుల వద్ద విద్యుత్తు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. జిల్లాలో ఏడాదిన్నరలో విద్యుదాఘాతాలతో రైతులు, సామాన్యులతో పాటు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో తగిన స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. వర్షకాలంలో దాదాపు అన్ని నేలలు తేమతో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్లు ఇతర పరికరాల విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాప్రాయం తప్పదు. విద్యుత్‌ విషయంలో అధికారుల తప్పిదంతో కొన్ని సంఘటనలు జరిగితే మరికొన్ని అవగాహన లేకపోవడం వల్ల చేసుకుంటున్నాయి.

    నష్టపరిహారం కొంతే..
    జిల్లాలో 2015 సంవత్సరంలో 123 మంది విద్యుదాఘాతంతో మృతిచెందారు. ఇందులో ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు కూడా ఉన్నారు. కాగా, ఇందులో సగానికి పైగా రైతులు ఉన్నారు. అదేవిధంగా 41 పశువులు మృత్యువాత పడ్డాయి. 2016 జూలై 30 వరకు 32 మంది రైతులతో పాటు సామాన్యులు మృతి చెందారు. 70 పశువులు మృత్యువాత పడ్డాయి. వీటిలో గత ఏడాది 47 మందికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.2 లక్షల చొప్పున, 35 పశువులకు రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం అందించారు.

    ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నస్టపరిహారం పెంచడంతో ఏడుగురికి రూ.4 లక్షల చొప్పున, 32 పశువులకు రూ.40 వేల చొప్పున పరిహారం అందజేశారు. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా కరెంట్‌షాక్‌కు ఎక్కువగా రైతులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తున్న అంశం. వారికి ఎలాంటి సూచనలు, సలహాలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రైతన్న తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే.

    జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు

    • పెద్దశంకరంపేట మండలం కె.వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ఎర్ర సాయిలు ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద వైర్లు సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
    • మెదక్‌ మండలం రాజ్‌పల్లిలో బుచ్చ దయాకర్‌ అనే రైతు పొలం వద్ద విద్యుత్తు తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
    • కౌడిపల్లి మండలం చిలిప్‌చెడ్‌ గ్రామ రైతు కలాలి దశరథ్‌గౌడ్‌ వ్యవసాయ బోరు మోటార్‌ బాగు చేస్తూ విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాడు.
    • జిన్నారం మండలం జంగంపేటలో గుండా శంకరయ్య రైతుకు చెందిన రెండు పాడి గేదెలు కరెంట్‌ షాక్‌తో మృత్యువాత పడ్డాయి.
    • శివ్వంపేట మండలం లింగోజి తండాకు చెందిన నెనావత్‌ బిక్యా కాడెడ్లు మేత మేస్తూ విద్యుత్తు షాక్‌తో మృతి చెందాయి.

    ఎర్తింగ్‌ లేకపోవడంతో...
    విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల ఎర్తింగ్‌ లేకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాటిని ఏర్పాటు చేసినప్పుడు కాంట్రాక్టర్లు అవసరమైనంత లోతుగా గుంతలు తీయకపోవడం, నాణ్యమైన పైపులు వేయకపోవడం, ఉప్పు, బొగ్గు లాంటి ముడిపదార్ధాలు సరైన మోతాదులో వేయకపోవడంతో ఎర్తింగ్‌ వస్తుంటుంది. అంతేకాకుండా నాణ్యత లేకుండా ఎర్తింగ్‌ చేయడంతో భూమిలో తేమశాతం ఉన్నంత మాత్రమే అది పనిచేస్తుంది.

    ఈ జాగ్రత్తలు తప్పనిసరి

    • రైతులు ఐఎస్‌ఐ మోటార్లు మాత్రమే వాడాలి
    • మోటార్‌ పనిచేయకపోతే చేత్తో పట్టుకోకుండా జాగ్రత్త పడాలి
    • టెస్టర్‌ సహాయంతో మోటార్‌ను పరీక్షించాలి
    • ప్రధానంగా మోటార్‌లకు కప్పులు ఉంచడం మంచింది
    • ఎర్తింగ్‌ తప్పనిసరిగా ఉండాలి. మోటార్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి
    • ప్యూజ్‌ బ్యాక్స్‌లు, స్టార్టర్లు అన్‌ చేసే చోట నీరు, బురద లేకుండా చూసుకోవాలి
    • స్టార్టర్‌ను పంప్‌సెట్‌ దగ్గరలో పొడిగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి. స్టార్టర్‌కు రక్షణ కవచాలు ఉండాలి
    • ట్రాన్స్‌ఫార్మర్లను రిపేర్‌ చేయాల్సినప్పడు విద్యుత్తు సిబ్బందికి తెలియజేయాలి
    • ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫ్యూజ్‌ పోయినప్పడు, తీగలు తెగినప్పడు రిపేర్ల కోసం ఎయిర్‌ బ్రేక్‌(ఏబీ) స్విచ్‌ ద్వారా సరఫరా నిలిపివేయాలి

    అప్రమత్తంగా ఉండాలి
    వర్షాకాలంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టార్టర్‌ డబ్బాలు నాణ్యమైనవి వాడాలి. వాటిని తెరిచే ముందు జాగ్రత్తలు పాటించాలి. రైతులు విద్యుత్తు పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా లైన్‌మన్లకు సమాచారం ఇవ్వాలి. - పండరి నాయక్‌, ఏడీఈ, ట్రాన్స్‌కో సిద్దిపేట

మరిన్ని వార్తలు