సిమ్ బ్లాక్ చేయించి డబ్బు కాజేస్తారు!

3 Oct, 2016 07:05 IST|Sakshi
సిమ్ బ్లాక్ చేయించి డబ్బు కాజేస్తారు!

సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకుల కాల్‌సెంటర్ల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఆన్‌లైన్‌లో అందినకాడికి కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ చెప్పని వినియోగదారుల్ని ‘4జీ’తో బురిడీ కొట్టిస్తున్నారు. వినియోగిస్తున్న సిమ్‌కార్డుల్ని వారితోనే బ్లాక్‌ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. దాదాపు రూ.లక్ష కోల్పోయిన ఓ నగరవాసి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ‘నయా’వంచన వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ రకంగా దోచారు...
బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి ఖాతాలు ఖాళీ చేసే నేరాలు దాదాపు రెండేళ్లుగా జోరుగా సాగుతున్నాయి. జుమ్‌తార, ఢిల్లీ కేంద్రాలుగా వ్యవస్థీకృతంగా ‘ఈ–నేరాలు’ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఆయా ప్రాంతాల్లో దీని కోసం ప్రత్యేకంగా కాల్‌సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాదారులకు ఫోన్లు చేయిస్తుంటారు.

తాము ఫలానా బ్యాంక్‌ కాల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకునే నేరగాళ్లు క్రెడిట్‌/డెబిట్‌ కార్డ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామనో, ఆధార్‌ సీడింగ్‌ అనో చెప్పి వినియోగదారుల నుంచి కార్డ్, పిన్‌ నెంబర్లతో పాటు ఓటీపీ సైతం తీసుకుంటున్నారు. ఆపై ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా వారి ఖాతాల్లో ఉన్న నగదు స్వాహా చేయడం, ఈ–కామర్స్‌ సైట్స్‌లో ఖరీదు చేయడం చేసి మోసం చేస్తున్నారు.

కస్టమర్లకు ‘కొంత’ అవగాహన రావడంతో...
ఈ తరహా సైబర్‌ నేరాలు, నేరగాళ్లు చేసే మోసాలపై వినియోగదారులకు కొంతమేర అవగాహన ఏర్పడింది. దీంతో బ్యాంకుల పేరుతో కాల్స్‌ చేస్తున్న కేటుగాళ్లకు అన్ని వివరాలూ చెప్తున్నప్పటికీ... ఓటీపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అనుమానిస్తున్నారు. దీంతో ఆ నెంబర్‌ చెప్పకుండా ఫోన్లు కట్‌ చేస్తున్నారు. ఈ రకంగా ‘నష్టపోతున్నామని’ గుర్తించిన సైబర్‌ నేరగాళ్లు ఇటీవల ‘4జీ’ ఎత్తులు వేస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ‘3జీ’ నుంచి ‘4జీ’కి అప్‌గ్రేడ్‌ కావడంతో అనేక సెల్‌ఫోన్‌ సర్వీసు ప్రొవైడర్లు సైతం అందుకు తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు సెల్‌ఫోన్‌ వినియోగదారులు వాడుతున్నవి ‘3జీ’ సిమ్‌కార్డులు కావడంతో ‘4జీ’కి తగ్గట్టు అప్‌గ్రేడ్‌ చేసిన  సిమ్‌కార్డుల్ని అందిస్తూ మార్పిడికి అవకాశం కల్పిస్తున్నారు.

సిమ్‌కార్డుల్ని సైతం తీసుకుంటున్నారు...
ఇలా కొత్త సిమ్‌ పొందాలనుకున్న వినియోగదారులు ఆయా సెల్‌ఫోన్‌ కంపెనీల ఔట్‌లెట్స్‌ నుంచి కొత్త సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. అప్పటికే వినియోగిస్తున్న సిమ్‌ నుంచి కొత్త సిమ్‌పై ఉన్న నెంబర్‌ను నిర్దేశిత నెంబర్లకు ఎస్సెమ్మెస్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మాత్రమే కొత్త సిమ్‌ యాక్టివేట్‌ కావడంతో పాటు పాత సిమ్‌ బ్లాక్‌ అవుతుంది.

సరిగ్గా ఇదే విధానాన్ని సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఓటీపీ మినహా మిగతా వివరాలను వినియోగదారుల నుంచి సంగ్రహిచిన తర్వాత వారి పేర్లతో ‘4జీ’ సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు. సర్వీసు ప్రొవైడర్‌ పంపిస్తున్నట్లు ఈ సిమ్‌కార్డు నెంబర్‌ను వినియోగదారుడికి ఎస్సెమ్మెస్‌ రూపంలో పంపి.. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ సంఖ్యను ఫలానా నెంబర్‌కు పంపాలని కోరుతున్నారు.

అనుమానం రాకుండా ‘పని’ పూర్తి...
సదరు ఎస్సెమ్మెస్‌ సర్వీసు ప్రొవైడర్‌ నుంచే వచ్చిందని భావిస్తున్న వినియోగదారులు సదరు సిమ్‌ నెంబర్‌ను కాల్‌సెంటర్‌కు ఎస్సెమ్మెస్‌ చేస్తున్నారు. దీంతో కొద్దిసేపటికే ఈ సిమ్‌ బ్లాక్‌ కావడంతో పాటు నేరగాళ్ల దగ్గర ఉన్న ‘4జీ’ సిమ్‌ యాక్టివేట్‌ అవుతోంది. అప్పటికే సదరు వినియోగదారుడికి సంబంధించిన కార్డ్, పిన్‌ వివరాలు వారి వద్ద ఉండటంతో వాటితో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేస్తున్నారు. ‘4జీ’ యాక్టివేషన్‌ కారణంగా ఓటీపీ సైతం వారికే చేరుతోంది.

ఇలా వినియోగదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా కొల్లగొట్టేస్తున్నారు. కస్టమర్‌కు ఈ విషయం తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నగరానికి చెందిన ఓ వ్యక్తిని ఈ తరహాలో టోకరా వేసిన సైబర్‌ నేరగాళ్లు ఆయన ఖాతాలో ఉన్న దాదాపు రూ.లక్ష కాజేశారు. ఇటీవల ఈ విధంగా నష్టపోయిన ఐదుగురు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

అప్రమత్తతే ఉత్తమం
‘ఇలాంటి నేరాల బారినపడకుండా ఉండలంటే సెల్‌ఫోన్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండమే ఉత్తమం. ఇటీవల సిమ్‌ బ్లాక్‌ అనే సమస్య ఉత్పన్నం కావట్లేదు. అలా ఎవరి సిమ్‌కార్డ్‌ అయినా బ్లాక్‌ అయితే తక్షణం అప్రమత్తం కావాలి. ఫలానా నెంబర్‌ను కాల్‌ సెంటర్‌కు పంపండి అంటూ వచ్చే ఎస్సెమ్మెస్‌లనూ అనుమానించాల్సిందే. సదరు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించకుండా ఇలాంటివి పంపరాదు. మోసపోయిన వారు ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి’.
                      – కేసీఎస్‌ రఘువీర్, సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ

>
మరిన్ని వార్తలు