రెక్కలకష్టం ఆపేశారు

17 Mar, 2016 03:20 IST|Sakshi
రెక్కలకష్టం ఆపేశారు

కూలి డబ్బులకు లక్షన్నర మంది ఎదురుచూపు
రూ.26 కోట్లు బకాయిపడిన సర్కారు
నిధుల ఆలస్యంతో ఉపాధి పనులపై ప్రభావం
పనులకు వచ్చేవారి సంఖ్య భారీగా తగ్గుముఖం

గత నెల 29న ఉపాధి పనులకు 1.03 లక్షల మంది హాజరుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 75 వేలకు పడిపోయింది. నిధుల నిలిపివేతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో యంత్రాంగం  దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది.జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంది. బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లోనే బకాయిలు అధికం.  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల గ్రహణం పట్టుకుంది. కరువు కరాళ నృత్యంతో బతుకు బరువై.. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలకు డబ్బులివ్వకుండా సర్కారు పొట్టకొడుతోంది. ఎనిమిది వారాలుగా సుమారు లక్షన్నర మంది కూలీల రెక్కల కష్టాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దాదాపు రూ.26 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో జిల్లాలో ఈజీఎస్ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బకాయిలు పెరిగిపోవడంతో ఉపాధికి వచ్చే కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

 సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. దీంతో రైతులు కూడా ఉపాధి కూలీలుగా మారిపోయారు. ఈ క్రమంలో పనిదినాలను ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.06 కోట్ల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే ఈ సంఖ్య దాటిపోయింది. ఈ పనిదినాలను విశ్లేషిస్తే జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేయవచ్చు.

 ఈ మండలాల్లో అధికం..!
ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రబీ పంటల సాగు పడిపోయింది. దీంతో వ్యవసాయ కూలీలు సైతం ఉపాధి బాట పట్టారు. ఈ క్రమంలోనే జిల్లాలో రికార్డు స్థాయిలో పని దినాలు నమోదయ్యాయి. వ్యవసాయాధారిత ప్రాంతాలైన బంట్వారం, యాచారం, మంచాల, దోమ, పెద్దేముల్ మండలాల్లో ఈజీఎస్ పనులు ముమ్మరంగా సాగాయి. అదే సమయంలో జిల్లాకు బకాయిపడిన రూ.26 కోట్లలో సింహభాగం ఇక్కడే చెల్లించాల్సివుంది. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లా యాజ మాన్య సంస్థ (డ్వామా) 52,704 మందికి వంద రోజుల పనిదినాలను కల్పించింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 2.89 లక్షల మంది జాబ్‌కార్డుదారుల్లో ఇప్పటివరకు 2.30 లక్షల మందికి ఉపాధి చూపించారు.

రెండు నెలలుగా కూలి డబ్బుల్లేవు
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు మావి. ఉపాధి పనులు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులివ్వలేదు. ఎట్టా బతకాలె. ఉపాధి పనులు చేసి పస్తులుండాల్సిన దుస్థితి. మాకు ఎనిమిది వారాలకు పైగా చేసిన పనులకు కూలి డబ్బులు రావాలి. ఎన్నిసార్లు ధర్నా చేసినా పట్టించుకునేవారు లేరు.  - మడ్డి యాదమ్మ, నక్కర్తమేడిపల్లి, యాచారం

రెండు నెలలుగా ఇయ్యట్లే..
ఉపాధి హామీ పథకంలో రెండు నెలలు పనిచేసినం. ఇప్పటి వరకు కూలి డబ్బులు ఇయ్యలె. అసలే కరువు ఉంది.. ఈ యేడు ఎక్కడ కూడా పంటలు వెయ్యలె. కూలి చేయడం తప్ప వేరే బతుకుదెరువు లేదు. చేసిన పనులకు కూలి ఇవ్వండని ఎన్ని రోజులు అధికారుల సుట్టు తిరగాలె. వారం వారం ఇస్తామన్నారు.. ఎక్కడిస్తున్నారు?  - చౌట వెంకటయ్య, అంతారం, కుల్కచర్ల మండలం

 ఎవ్వరూ పట్టించుకుంటలేరు..
ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఆరు వారాల కంటే ఎక్కువే అయింది. ప్రతి సోమవారం ప్రజాదర్బారులో అడుగుతున్నాం. ఉపాది సిబ్బంది తీరు బాగా లేదు. ఇలాగైతే ఎలా.. పెద్ద సార్లు పట్టించుకొని తమ కూలీ డబ్బులు తమకు ఇప్పించాలె.
- ఆంజనేయులు, మాలసోమారం, బంట్వారం మండలం

 

మరిన్ని వార్తలు