నంద్యాల: స్థానిక వైఎస్ఆర్ నగర్కు చెందిన వివాహిత హత్యకు గురైనట్లు తేల్చిన పోలీసులు ఆమె మృతదేహాన్ని పక్కింట్లో పూడ్చినట్లు గుర్తించి మంగళవారం వెలికితీశారు. స్థానిక టెక్కెలోని సుద్దుల పేటకు చెందిన బుడగజంగాల సంఘం అధ్యక్షుడు జమ్మడక్క కుమార్తె లక్ష్మి(18)ని వైఎస్సార్నగర్కు చెందిన బాబయ్య 2015లో పెళ్లిచేసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకోవడంతో కుటుంబంలో కలతలు వచ్చాయి. పెద్దమనుషులు పంచాయితీ నిర్వహించి రాజీ చేశారు.
ఈ క్రమంలో గత ఏప్రిల్ 29 రాత్రి భార్యతో గొడవ పెట్టుకున్న బాబయ్య ఆమెను హత్య చేశాడు. ఇంటి సమీపంలో కంపచెట్ల మధ్య నిర్మాణంలో ఉన్న ఓ ఇంటిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు. అయితే లక్ష్మి తండ్రి జమ్మడక్క ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపారు. మృతదేహాన్ని ఆ ఇంట్లో పూడ్చినట్లు గుర్తించి వెలికి తీశారు. కర్నూలు నుంచి వచ్చిన ఫోరెన్సిక్ సిబ్బంది ఎముకలు, పుర్రెను బయటకు తీశారు. వీటిని డీఎన్ఏ పరీక్షలకు పంపుతున్నామని, నివేదిక రాగానే విచారణ పూర్తి చేస్తామని రూరల్ సీఐ మురళీధర్రెడ్డి తెలిపారు.