ప్రేమ పేరుతో వంచన

28 Jun, 2016 11:18 IST|Sakshi

పెళ్లికి నిరాకరించిన   ప్రేమికుడు
ప్రియురాలిపై దాడి
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
 

 ఎల్లారెడ్డిపేట : ప్రేమ పేరుతో ఓ యువకుడు ఐదేళ్లుగా ఓ యువతిని వంచిం చాడు. మోజు తీరడంతో పెళ్లికి ముఖం చాటేశాడు. దీంతో ప్రేమికుడి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా ప్రియురాలిపై కుటుంబసభ్యులతో కలిసి దాడిచేశాడు. మోసపోయిన గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి చెందిన దోమకొండ ఇంద్రజ బెజ్జంకి మండలం గాగిల్లపూర్‌కు చెందిన ఎర్రోల్ల తిరుపతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2011లో కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. క్రమంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2011 నుంచి 2013 వరకూ ప్రేమించుకున్నారు.

ఈ క్రమంలోనే మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఏడాదిపాటు దూరంగా ఉన్నారు. రెండున్నర ఏళ్లుగా ప్రేమ పేరుతో తిరుపతి మళ్లీ ఇంద్రజ వెంటపడ్డాడు. అతడిని నమ్మిన యువతి దగ్గరైంది. ఇటీవల పెళ్లిపేరు ఎత్తగానే జారుకున్నాడు. ఈనెల 10న తిరుపతి ఇంటికి వెళ్లి పెళ్లి విషయమై ఇంద్రజ నిలదీసింది. దీంతో తిరుపతితోపాటు అతడి కుటుంబసభ్యులు బాలమల్లవ్వ, బాలమల్లు, కొమురయ్య, తిరుమల తీవ్రంగా కొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం జరిగిన సంఘటనపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఐదుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు