అనంతపురం అర్బన్ : జిల్లాలో ఇప్పటి వరకు దీపం పథకం కింద వంట గ్యాస్ కనెక్షన్లను మహిళల పేరు మీద మాత్రమే ఇచ్చే వారు. ఈ విధానంలో ప్రభుత్వం మార్పు చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లాలో కొందరు ఒక్కరే తెల్ల రేషన్ కార్డులో సభ్యునిగా ఉన్నారు. అది ముఖ్యంగా పరుషులు మాత్రమే ఇలా (సింగిల్ మెంబర్)ఉన్నారు. సింగిల్ మెంబర్ కార్డులు జిల్లాలో 15 వేల వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు కేవలం మహిళల పేరున మాత్రమే దీపం కనెక్షన్ ఇస్తుండంతో, తెల్లకార్డు కలిగి ఉన్నప్పటికీ పురుషుడు ఒక్కరే కార్డులో సభ్యునిగా ఉన్న కారణంగా గ్యాస్ కనెక్షన్ మంజూరయ్యేది కాదు. ఇలాంటి వారికి కూడా దీపం పథకం కింద కనెక్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి జిల్లా యంత్రాగం పంపింది. ఇందుకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు. సింగిల్ మెంబర్ కార్డులకూ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేలా ఉత్తర్వులను త్వరలో జారీ చేస్తామని ఉన్నతాధికారులు నుంచి సమాచారం అందిందని అధికార వర్గాలు తెలిపాయి.