విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలోని ఐదు, ఆరో జోన్ల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యూవల్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈమేరకు హన్మకొండలోని ఉన్నతవిద్య ఆర్జేడీ డాక్టర్ బి.దర్జన్కు ఉత్తర్వులు అందాయి. ఆయా జోన్లలో మెుత్తం 860 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో గత విద్యా సంవత్సరంలో బోధన చేసి ఈ విద్యాసంవత్సరంలో కొనసాగుతున్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభు త్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, జేసీ, కళాశాల ప్రిన్సిపాల్లతో కూడిన కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలించి రెన్యూవల్ చేస్తుందని అందులో ప్రస్తావించారు. గత విద్యా సంవత్సరంలో పనిచేసి ఇప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యాపకులకు సంబంధించిన దరఖాస్తులను ప్రిన్సిపాల్స్ ఉన్నత విద్య ఆర్జేడీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులలో వివిధ సబ్జెక్టులలో ఎక్కడైనా జిల్లాల్లో ఖాళీగా ఉంటే అక్కడికి వారిని నియమించే అవకాశాలు ఉంటాయి.