దివాకరా.. విను మా మొర !

8 Sep, 2017 23:26 IST|Sakshi
దివాకరా.. విను మా మొర !

అభివృద్ధికి దూరంగా పెద్దవడుగూరు
జేసీ దివాకర్‌రెడ్డి దత్తత గ్రామంలో సమస్యల తిష్ట
జేసీ తీరుపై స్థానికుల అసంతృప్తి



పెద్దవడుగూరు: అనంతపురం జిల్లాలోనే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జాతిపిత మహాత్మాగాంధి స్వాతంత్య్ర సమరం జరుగుతున్న సమయంలో 1934లో ఈ గ్రామాన్ని కుమ్మెత చిన్నారపరెడ్డి ఆహ్వానం మేరకు సందర్శించారు. సామంతరాజులు కూడా పరిపాలించిన ఈ ప్రాంతం ప్రస్తుతం అభివృద్ధికి దూరంగా ఉంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దత్తత తీసుకొని రెండేళ్లవుతున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో జనంతా కష్టాలతో సావాసం చేస్తున్నారు. - పెద్దవడుగూరు

పేరు వచ్చిందిలా....
ఈ ప్రాంతాన్ని సామంతరాజులు పరిపాలించినట్లు కొన్ని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. 17 వ శతాబ్ధం నుండి జనజీవనం ప్రారంభం అయినట్లుగా చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ శైవారాధకులు అధికంగా నివసించేవారు. పూర్వం బ్రాహ్మణులు ఇక్కడ ఎక్కువగా నివసించేవారు. బ్రాహ్మణ బాలురకు ఉపనయన సంస్కారం చేయడమే వీరికి ప్రధాన వృత్తిగా ఉండేది. ఉపనయనమునే స్థానిక వ్యవహారిక భాషలో వడుగు అని అంటారు. వడుగుల కార్యక్రమం అధికంగా జరుగుతున్న గ్రామం కనుక ఇది వడుగూరుగా పిలువ బడిందని చరిత్రకారులు చెబుతారు. కాలక్రమేనా పెద్దవడుగూరుగా మారింది.

పట్టించుకోని జేసీ
ప్రస్తుత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి... ఎన్నో ఏళ్లు తాడిపత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే పెద్దవడుగూరు గ్రామాన్ని మాత్రం ఆయన ఏరోజూ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కేవలం ఎన్నికల సమయంలోనూ,  సంక్షేమ పథకాలు ప్రారంభ సమయంలోనూ గ్రామాల్లో పర్యటించేవారని గ్రామస్తులు వాపోతున్నారు.  రెండు సంవత్సరాల క్రితం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

సమస్యల తిష్ట
డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఊరంతా కంపు కొడుతూ పెద్ద దిబ్బలాగా కనపడుతోంది. గ్రామంలో ఎక్కడ చూసినా మురికి గుంతలే దర్శనం ఇస్తున్నాయి. గ్రామం నుండి మిడుతూరుకి Ðవెళ్ళే ప్రధాన రహదారికి సిమెంటు రోడ్డుకు ఇరు పక్కలా మురికి నీటి కాలువలు లేకపోవడంతో చిన్న పాటి వర్షం వస్తే రోడ్డు పైకి వర్షంనీరు వచ్చి దుర్వాసన వెదజల్లుతోంది. గ్రామంలోకి ఎమ్మెల్యే వస్తున్నాడని తెలిస్తేనే అధికారులు గ్రామంలోని మురికి కాలువలు , రోడ్లు శుభ్రం చేస్తారు తప్ప తరువాత పట్టించుకోరని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వంకగేరిలో సైడు కాలువల్లో పూడికతీయక పోవడంతో మురికి నీరు సీసీ రోడ్డు పై చేరి దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దత్తత తీసుకున్నా అభివృద్ధి శూన్యం
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పెద్దవడుగూరును దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి పేరుతో గ్రామంలో కొన్నిమార్పులు తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా కొద్దిరోజులు అధికారులు గ్రామంలో తిరిగి సీసీ రోడ్లు, సైడు కాలువలు నిర్మించి అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ కేవలం గుత్తిరోడ్డు మాత్రమే అభివృద్ధి చేశారు. నూతనంగా రూ.2.5 కోట్ల కల్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు.

పెద్దవంకలో వాటర్‌షెడ్డు నిర్మాణం, గండికోట రిజర్వాయర్‌ నుండి శాశ్వత తాగునీటి పరిష్కారానికి  గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌ విరాళం ఇచ్చారు. సుమారు రూ. 35 లక్షల పన్నులు వసూళ్లతో పంచాయతీ ఆర్థికంగా బలంగా ఉన్నా ఇంత వరకూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు మాత్రం ఊపందుకోలేదు. పెద్ద పనులు చేపడుతున్న జేసీ సోదరులు చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం లేదని  స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కాలనీలో సీసీ రోడ్లు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు తమ కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదని వాపోతున్నారు. గ్రామంలో వీధి దీపాలు కూడా వెలగడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవాలని అంటున్నారు.

దూరమైన పాఠశాల
30 ఏళ్లుగా  గ్రామం నడిబొడ్డున ఉన్న ప్రధాన ప్రాథమిక పాఠశాల భవనాన్ని తొలగించి 16–09–2015 లో పంచాయతీ కాంప్లెక్స్‌ నిర్మాణం చేయడానికి భూమి పూజ చేశారు. ఈ ఆదేశాలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే ఈ పాఠశాల ఎస్సీ కాలనీ ప్రజలకు దగ్గరగా ఉండటంతో ఎక్కువగా ఎస్సీ విద్యార్థులే ఈ పాఠశాలలో చదువుకునేందుకు ఎక్కవగా వస్తుండేవారు. పాఠశాల భవనాన్ని కూల్చివేయడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలను జిల్లా పరిషత్‌ పాఠశాలలోకి మార్చడంతో దూరం ఎక్కువడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దిష్టిబొమ్మలా డంపింగ్‌యార్డ్‌
గ్రామంలో చెత్త నిల్వ కేంద్రం నిర్మాణం పూర్తయినా ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైంది.ఇందులో చెత్తను వేరుచేసి సంపదను సృష్టించే యంత్రాలను ఇప్పటి వరకూ ఏర్పాటు చేయకపోవడంతో దిష్టిబొమ్మలా ఉంది. అయితే పంచాయితీ ఆర్థికంగా ఎదుగుదల కోసం కాంప్లెక్స్‌ నిర్మిస్తామని ఎమ్మెల్మే చెబుతున్నారు.

కాలనీ వైపు కన్నెతి చూడలేదు
గ్రామంలోని చేనేత కాలనీలో సుమారుగా 150 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాలనీలో సమస్యలు అధికంగా ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే సీసీ రోడ్లు వేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత జేసీ ప్రభాకర్‌రెడ్డి కాలనీలోకి ఒక్కసారి కూడా రాలేదు.
- సుధీర్‌ చేనేత కాలనీ

ఇబ్బందులు పట్టవా?
సీసీ రోడ్లు వేశారు. కాని సైడు కాలువలు వేయలేదు. ఎక్కడి మురికి నీరు అక్కడే నిలువ ఉంటోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కళ్యాణ మండపం, గుత్తి రోడ్డు తప్ప ప్రజల ఇబ్బందులు పట్టించుకోలేదు.
- వెంకటనారాయణ ఎస్‌టీ కాలనీ

నియోజకవర్గం : తాడిపత్రి
మండలం: పెద్దవడుగూరు
జనాభా : 5963
పురుషులు: 2952
స్త్రీలు : 3011
ఓటర్లు :4179
పురుషులు: 2334
స్త్రీలు : 2145
చదువుకున్న వారు :3858
పురుషులు:1920
స్త్రీలు :1938

 

మరిన్ని వార్తలు