► చంద్రబాబు పాలనలో మహిళలకు అన్యాయం: ధర్మాన
► 17.76 శాతం అభివృద్ధి సాధించి వుంటే లోటు బడ్జెట్ ఉండదు
► పేదలకు వ్యతిరేకమైన పరిపాలనపై పోరాటం చేద్దాం
► విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు మోసపోయారు
► కలిసికట్టుగా చంద్రబాబుపై పోరాడుదాం : ధర్మాన
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ప్రారంభమైంది. బుధవారం కాకినాడలో వైఎస్ఆర్సీపీ యువభేరీ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 17.76 శాతం అభివృద్ధి ఉంటే లోటు బడ్జెట్ ఉండదని అన్నారు. పేదలకు వ్యతిరేకమైన పరిపాలనపై పోరాటం చేద్దామని తెలిపారు. కలిసికట్టుగా చంద్రబాబుపై పోరాడదమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో విశ్రమించకుండా పనిచేద్దామని ధర్మాన పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్న మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు స్వాగతమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సమావేశం ఎనిమిది సార్లు జరిగితే అందులో ప్రధాన చర్చ ఇసుకపైనే జరిగిందని అన్నారు. ఇసుకపై కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్రంలో ధాన్యం కోరే పరిస్థితి లేదని, ధాన్యాన్ని కొనేవారే కనిపించడం లేదని చెప్పారు. అయితే రైతులు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెబుతున్నారని ధర్నాన విమర్శించారు.