-

ప్రియుడి ఇంటి ముందు ధర్నా

28 Jul, 2016 10:45 IST|Sakshi
ప్రియుడి ఇంటిముందు బైఠాయించిన యువతి

►పెళ్లి చేసుకోవాలని బైఠాయింపు..  ప్రియుడు కానిస్టేబుల్‌

నారాయణఖేడ్‌: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనను మోసం చేశాడంటూ పెళ్లి చేసుకోవాలని కానిస్టేబుల్‌ ఇంటి ముందు బైఠాయించింది. ఈ సంఘటన మండలంలోని కొండపూర్‌ స్కూల్‌ తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మనూరు మండలం శేరి దామర్‌గిద్ద  పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్‌ తండాకు చెందిన విస్లావత్‌ లలిత(21) పెద్దశంకరంపేటలో డిగ్రీ చదువుతోంది. కొండాపూర్‌ స్కూల్‌ తండాకు చెందిన రాథోడ్‌ విశ్వనాథ్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు  వీరు పరస్పరం ప్రేమించుకున్నారు.

ప్రస్తుతం కానిస్టేబుల్‌ విశ్వనాథ్‌ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు మనూరు పోలీసులను రెండు రోజుల క్రితం ఆశ్రయించగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు మహిళ బుధవారం స్వయంగా కానిస్టేబుల్‌ ఇంటికి వెళ్లి తనను విశ్వనాథ్‌ మోసం చేశాడని, పెళ్లి చేసుకొని న్యాయం చేసేవరకు కదిలేది లేదని బైఠాయించింది.

మూడు గంటలపాటు ఇంటిముందే ధర్నా చేపట్టింది. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్‌ సీఐ సైదానాయక్‌ తండాకు వెళ్లి యువతికి నచ్చచెప్పారు. నిందితుడిపై తగు చర్యలు తీసుకునేలా తాము చూస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపచేశారు.

మరిన్ని వార్తలు