పార్వతీపురం, పార్వతీపురం రూరల్: పార్వతీపురం ప్రాంతంలో మంగళవారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విభిన్న వాతావరణం ఏర్పడింది. ఉదయం పార్వతీపురం సమీపంలోని గిరులను మేఘాలు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం పట్టణమంతా కారుమబ్బులతో చీకటిమయం చేశాయి. సాయంత్రం కుండపోత వానగా కురిసి సేదదీర్చాయి. మండలంలో మంగళవారం కురిసిన వర్షం అన్నదాతలకు ఊరటనిచ్చింది. జోరుగా ఉబాలు జరుగుతున్న సమయంలో వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.