జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు

19 Aug, 2016 23:46 IST|Sakshi
తాడేపల్లిగూడెం రూరల్‌ : జిల్లాలోని అన్ని జెడ్పీ హైస్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. కడియద్ద జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో గోదావరి విద్యా వికాస్‌ చైతన్య వేదిక సౌజన్యంతో బయోమెట్రిక్‌ విధానంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌లో డిజిటల్‌ విధానంలో విద్యాబోధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి విద్యావికాస్‌ చైతన్య వేదిక చేస్తున్న విద్యాసేవలను ఆయన అభినందించారు. జిల్లాలోని 100 పాఠశాలలను దత్తత తీసుకుని ఆయా పాఠశాలలకు మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు కార్పొరేట్‌ స్థాయిలో విద్యాబోధన చేయనున్నట్టు తెలిపారు. ఏఎంసీ చైర్మన్‌ పాతూరి రామ్‌ప్రసాద్‌ చౌదరి, డీసీసీబీ డైరెక్టర్‌ దాసరి అప్పన్న, తాడేపల్లిగూడెం, పెంటపాడు ఎంపీపీలు పరిమి రవికుమార్, పెదపోలు వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్‌ పాకనాటి నాగదీప్తి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు