గాడిలో పాలన!

23 Jun, 2016 13:23 IST|Sakshi

 ఐటీడీఏ పురోగమనానికి వడివడిగా అడుగులు
  గ్రామ దర్శిని పేరుతో గిరిజనుల చెంతకు అధికారులు
  మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం
  ఐటీడీఏ పీఓ ప్రసన్న వెంకటేశ్ మార్కు పాలనకు శ్రీకారం

 
 పార్వతీపురం: ఐటీడీఏ కొత్త  పీఓ వి.ప్రసన్న వెంకటేశ్ తన మార్కు పాలనకు శ్రీకారం చుట్టారు. ఐటీడీఏ పురోగమనానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. కొన్నాళ్లుగా గాలికి వదిలేసిన పాలనను గాడిలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గిరిజనులకు ఏం కావాలో తెలుసుకుని వాటిని అందించేందుకు తనదైన ‘వెల్ఫేర్’ శైలిలో చర్యలు చేపడుతున్నారు. సబ్-ప్లాన్‌లోని గిరిజనుల స్థితిగతులు, ఇప్పటి వారెదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి ఫలాలు వారికి చేరుతున్న తీరు తెలుసుకుని అందులో ఏమైనా లోపాలుంటే సవరించేందుకు కంకణం కట్టుకున్నారు.
 
 గ్రామ దర్శినితో గిరిజనుల చెంతకు...
 గిరిజనులకు అవసరమైన వాటిని సమకూర్చే లక్ష్యంతో ‘గ్రామ దర్శిని’ అనే కార్యక్రమాన్ని వారం రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి ఓ ప్రత్యేకాధికారిని నియమించి వారి ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా బృందాలు ఆయా మండలాల్లోని గిరిజన గ్రామాల్లో
 నిత్యం పర్యటించి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా అందుబాటులో ఉంచనున్నారు.
 
 కలెక్టర్ ఆమోదానికి ప్రత్యేకాధికారుల జాబితా
 సబ్-ప్లాన్‌లోని 8 మండలాలకు ప్రత్యేకాధికారుల నియామకం బుధవారం నాటికి పూర్తిచేసి, జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపించే ఏర్పాట్లు చేశారు. కొమరాడ మండలానికి ఆర్.వి.వి.ప్రసాద్(ఐటీడీఏ పీహెచ్‌ఓ), గుమ్మలక్ష్మీపురానికి జి.విజయకుమార్(డీడీ ఐటీడీఏ), కురుపాంకు మురళి(ఏపీడీ -వెలుగు), జియ్యమ్మవలసకు ఎ.వి.సుబ్బారావు(ఈఈ-ఐటీడీఏ), పార్వతీపురానికి వి.ఎస్.ప్రభాకరరావు(ఐటీడీఏ ఏపీఓ), మక్కువ మండలానికి బొబ్బిలి పశు సంవర్థకశాఖ ఏడీ, సాలూరుకు ఆర్.గోవిందరావు(ఆర్డీఓ), పాచిపెంటకు ఆర్.శ్రీనివాసరావు(ఉద్యానవన శాఖ ఏడీ)లను నియమించారు.
 
 గ్రామ దర్శినిలో ఏం చూస్తారంటే...
 ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో మలేరియా విస్తరిస్తోంది. దానిని కట్టడి చేయాలంటే మలేరియా నివారణ మందు అన్ని చోట్లా పిచికారీ చేసిందీ లేనిదీ పరిశీలిస్తారు. అనారోగ్యంతో ఉన్న గిరిజనులకు చక్కనైన వైద్యం అందిస్తారు.
 
 డాపౌట్స్‌ను గుర్తించి వారిని బడిలో చేర్పించేందుకు కౌన్సెలింగ్ చేపడతారు.

  జీడి మొక్కల జంటల కత్తిరింపుతో దిగుబడులు పెంచడం, అలాగే వాటర్‌షెడ్స్, ఫారమ్‌ఫాండ్స్ ఏర్పాటు, తాగునీటి పరిస్థితి తదితర వాటిని పరీశీలించి లోపాలను సరిచేస్తారు.
 
 అంగన్వాడీ సెంటర్ల పనితీరు, గిరిజన  తల్లీ, పిల్లలు, గర్భిణీ స్త్రీలకు అందే పోషకాహారం, తల్లీ పిల్లల మరణాలు తగ్గించడం, ఆస్పత్రి ప్రసవాలు పెంచడం తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు.
 
 గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతను తనిఖీ చేస్తారు. వారానికి ఓ రోజు తప్పనిసరిగా ఆ గ్రామాన్ని సందర్శించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు