యాదగిరిగుట్ట : చిన్నపాటి వర్షం పడితేచాలు యాదగిరిగుట్ట పట్టణంలో రహదారులతోపాటు అంతర్గత వీధులు బురదమయంగా మారుతున్నాయి. పైగా అంతర్గత, ప్రధాన రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్లు నిలుస్తుండడంతో మడుగులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు వచ్చే దారిలోని గుండ్లపల్లి వద్ద రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. అక్కడ మట్టి మొత్తం రోడ్లపైకి చేరి బురదగా మారింది. అంతేకాకుండా పట్టణంలోని శ్రీరాంనగర్లో సీసీరోడ్లు ధ్వంసమై గుంతలు పడటంతో అందులో నీరు నిలిచాయి. చెక్పోస్టు కాలనీలోని ఇంటి ముందు రోడ్లపై ఒండ్రుమట్టి చేరి ప్రజలు నడవడానికి సైతం ఇబ్బందులకు గురిచేస్తోంది. అధికారులు స్పందించి బురద, గుంతలమయంగా మారిన రోడ్లను బాగు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.