చెత్త విద్యుత్‌కు షాక్‌

9 May, 2017 01:27 IST|Sakshi
చెత్త విద్యుత్‌కు షాక్‌

‘చెత్త విద్యుత్‌’ ప్రాజెక్టుకు బాలారిష్టాలు
ప్లాంట్‌కు అనుమతుల నిరాకరణ
ఎస్టీ కాలనీ ఉండటమే కారణం
మరో స్థలం కోసం అన్వేషణ


రూ.200 కోట్ల భారీ ప్రాజెక్టుకు నేష నల్‌ పొల్యూషన్‌ బోర్టు మొకాలడ్డు వేసింది. వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ (చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే ప్రాజెక్టు) ను తిరుపతి కార్పొరేషన్‌ ప్రతిష్టాత్మకం గా చేపట్టింది. చంద్రగిరి మండలం శానంబట్ల సమీపంలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలని భావించింది.స్థల సేకరణ పూర్తయింది. పనుల ప్రారంభం కోసం రంగం సిద్ధం చేసుకునే సమయంలో బ్రేక్‌ పడింది. ప్లాంట్‌ నిర్మాణానికి ఈ ప్రాంతం అనువైంది కాదని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని నేషనల్‌ పొల్యూషన్‌ బోర్టు అనుమతులను నిరాకరించింది.

తిరుపతి తుడా: తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో రోజు కు 192 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. దీని సేకరణే ఓ సవాల్‌గా మారింది. ఇక సేకరించిన చెత్త గుట్టలు గుట్ట లుగా పేరుకుపోతోంది. కొతంకాలం వరకు తగులబెట్ట డం, మరి కొన్నాళ్లు పూడ్చేయడం వంటివి చేశారు. తద్వారా నీరు, భూమి, గాలి కాలుష్యం అవుతుండటంతో ఈ విధానానికి చెక్‌ పెట్టారు. తడి, పొడి చెత్తను వేరుచేసి కొంతవరకు వినియోగంలోకి తీసుకొచ్చారు. అయినా సగం నిల్వ ఉండటంతో పూర్తిస్థాయిలో చెత్తను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు భావించారు. ఢిల్లీ ప్రభుత్వం వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. 90 శాతం చెత్తను కనుమరుగు చేయడంతోపాటు తద్వారా తక్కువ ధరకే విద్యుత్‌ అందిస్తోంది. ఇదే తరహాలో చెత్తనుంచి విద్యుత్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్‌ అధికారులు భావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపారు. గ్రీన్‌ సిగ్నెల్‌ రావడంతో 2016 ఏప్రిల్‌లో ప్లాంట్‌ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి.

అనుమతులు నిరాకరణ..
వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఢిల్లీకి చెందిన జిందాల్‌ కంపెనీ దక్కించుకుంది. ఆ కంపెనీ ప్రభుత్వంతో అన్ని ఒప్పందాలు పూర్తి చేసుకుంది. ఎయిర్‌పోర్టు, నేషనల్‌ పొల్యూషన్‌ బోర్డు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. మార్చిలో ప్లాంట్‌ పనులు ప్రారంభించేలా ముహూర్తం ఖరారు చేసుకుంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి సకాలంలో అనుమతులు అందాయి. పొల్యూషన్‌ బోర్డు ప్రతినిధుల బృందం చంద్రగిరి మండలం శానంబట్ల సమీపంలోని 16.22 ఎకరాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ప్లాంట్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ స్థలానికి కూతవేటు దూరంలో తాటికోన ఎస్టీ కాలనీ ఉండటంతో ప్లాంట్‌ ఏర్పాటును పొల్యూషన్‌ బోర్టు సభ్యులు వ్యతిరేకించారు. తమ చట్టం ప్రకారం ఈ ప్లాంట్‌ ఏర్పాటు చట్ట విరుద్ధమని,, నిబంధనలు ఒప్పుకోవని తేల్చేశారు. దీంతో మరో స్థలాన్ని వెతుక్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ముచ్చటగా మూడోసారి..
వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటుకు స్థల సేకరణపై కార్పొరేషన్‌ దృష్టి సారించింది. ఇప్పటికే డంపింగ్‌ యార్డుగా వినియోగిస్తున్న రామాపురంలో తొలుత ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ ప్రదేశం అనువైంది కాదని జిందాల్‌ తిరస్కరించింది. చంద్రగిరి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. అప్పటి కలెక్టర్‌ సిద్ధార్థ్‌జైన్‌ శానంబట్ల సమీపంలోని సర్వే నంబర్‌ 1505, 1507లలో 16.22 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థలం ప్లాంట్‌కు అనువుగా ఉండటంతో కంపెనీ వేగంగా అడుగులు వేసింది. ఇంతలో పొల్యూషన్‌ బోర్డు అభ్యంతరం చెప్పడంతో మరోసారి స్థలం వెతుకులాటలో కార్పొరేషన్‌ తనమునకలైంది. ముచ్చటగా మూడోసారి చంద్రగిరి మండలంలోని సీ.మామండూరు సమీపంలో ప్రభుత్వ భూమిని గుర్తించారు. తమకు ఇక్కడ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు.

ఇదీ లక్ష్యం..
చెత్తను పూర్తి స్థాయిలో వినియోగించి, తద్వారా కార్పొరేషన్‌కు లబ్ధిచేకూర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు చేశారు. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో చెత్తను సేకరించడం, దాచడం, వినియోగించడం కార్పొరేషన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు కొన్ని వందల మెట్రిక్‌ టన్నుల చెత్త నిల్వ ఉంటోంది. ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ చెత్త సరిపోకపోవడంతో చిత్తూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, వెంకటగిరి ప్రాంతాల నుంచి సేకరించేలా ఒప్పందం కుదిరింది. మొత్తంగా రోజుకు 374 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరించి, తద్వారా రోజుకు 6 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

>
మరిన్ని వార్తలు