కర్నూలు : కర్నూలు శివారులోని పంచలింగాల దగ్గర ఉన్న జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని పరిసరాలను, గదులను ఖైదీలకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. న్యాయవాదిని నియమించుకునే స్థోమత లేనివారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. అనంతరం ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు. న్యాయవాదులు ఆదినారాయణరెడ్డి, పి.నిర్మల, నాగమణి, జైలు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.