16 నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ ఫెయిర్‌

14 Sep, 2016 00:10 IST|Sakshi
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (బాలురు)లో ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు జిల్లా స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నట్టు డీవైఈవో ఎం.తిరుమదాసు చెప్పారు. మంగళవారం హైస్కూల్‌లో కొయ్యలగూడెం విద్యాకమిటీ పరిధిలోని ప్రధానోపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా విజయవంతం చేయడానికి కృషిచేస్తున్నట్టు చెప్పారు. సైన్స్‌ ఫెయిర్‌కు జిల్లాస్థాయిలో విద్యార్థులు తమ ఎగ్జిబిట్స్‌తో వస్తారని, ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా సైన్స్‌ ఫెయిర్‌ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీల నిర్వహణ ప్రధానోపాధ్యాయులకు అప్పగించామన్నారు. రిజిస్ట్రేషన్‌ కమిటీకి బుట్టాయగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం జె.సురేష్‌బాబు, ఫుడ్‌కమిటీకి జంగారెడ్డిగూడెం జెడ్పీ హెచ్‌ఎస్‌ (బాలురు) స్కూల్‌ అసిస్టెంట్‌ ఎల్‌.నాగేశ్వరరావు, ప్రెస్‌ అండ్‌ పబ్లిసిటీ కమిటీకి జి.పంగిడిగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం ఏడీ శిఖామణి, కల్చరల్‌ కమిటీకి రేగులకుంట జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం కె.నాగేశ్వరరావు, డిసిప్లిన్‌ కమిటీకి రెడ్డిగణపవరం జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం బి.రాముడు బాధ్యులుగా వ్యవహరిస్తారన్నారు. మొత్తంగా 20 కమిటీలు నియమించామన్నారు. జంగారెడ్డిగూడెం ఎంఈవో ఆర్‌.రంగయ్య, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు