అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 23న ఆర్డీటీ స్టేడియంలో జిల్లా సాఫ్ట్బాల్ పురుషుల, మహిళల జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సాఫ్ట్బాల్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, వెంకటేశులు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు ఆర్డీటీ ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామన్నారు.
అనంతరం జిల్లా జట్లు గుంటూరు, మాచెర్ల జిల్లాలో జరుగు అంతర జిల్లాల పోటీలలో పాల్గోంటాయని పేర్కొన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులను రాష్ట్ర సాఫ్ట్బాల్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు అక్టోబర్ 3 నుంచి 8 వరకు అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటారని వెల్లడించారు.